
శాశ్వత పరిష్కారం చూపండి..
● జిల్లా రెవెన్యూ అధికారి
శ్రీనివాసమూర్తి
● పీజీఆర్ఎస్కు 166 వినతులు
విజయనగరం అర్బన్:
ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే వినతులకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు లాగిన్లో ఎప్పటికప్పుడు సమస్యలను చూసుకుంటూ రీ ఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజూ లాగిన్ అయ్యి వినతులను శతశాతం పరిష్కరించాలని ఆదేశించారు.
166 వినతుల స్వీకరణ..
కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు 166 వినతులు వచ్చాయి. డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు, విజయనగరం ఆర్డీఓ సవరమ్మ, పౌరసరఫరాల డీఎం బి.శాంతి, డీఈఓ యూ.మాణిక్యంనాయుడు హాజరై వినతులు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు అత్యధికంగా 69 వినతులు.. పంచాయతీ శాఖకు 17.. పింఛన్లు మంజూరు చేయాలని, తదితర అంశాలపై డీఆర్డీఏకు 22 వినతులు అందాయి. మున్సిపాలిటీకి 5, విద్యాశాఖకు 15, హౌసింగ్కు 2 అందగా వైద్యశాఖకు 4, విద్యుత్ శాఖకు 4 వినతులు రాగా.. మిగిలినవి ఇతర శాఖలకు చెందిన సమస్యలు.
చట్ట పరిధిలో పరిష్కరించాలి
● ఏఎస్పీ సౌమ్యలత
విజయనగరం క్రైమ్: అర్జీదారులు తెలియజేసిన సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించాలని ఏఎస్పీ పి. సౌమ్యలత అన్నారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదిక కార్యక్రమంలో 43 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఎస్పీ ఆదేశాల మేరకు ప్రజా సమస్యలు తెలుసుకున్నామన్నారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మొత్తం 43 వినతులు రాగా భూ తగాదాలకు సంబంధించినవి 15.. కుటుంబ కలహాలకు సంబంధించినవి 4.. మోసాలకు సంబంధించినవి 7.. ఇతర అంశాలకు సంబంధించినవి 17 ఉన్నాయన్నారు. ఏడు రోజుల్లో సమస్యలపై స్పందించి, వాటిపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, డీసీఆర్డీ సీఐ బి.సుధాకర్, ఎస్సై ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు.

శాశ్వత పరిష్కారం చూపండి..