
మిగులు సీట్లకు రాతపరీక్ష రేపు
విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 7, 8, 9వ తరగతుల్లో మిగులు సీట్లకు ఈ నెల 25న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా గురుకుల సమన్వయకర్త ఎస్.రూపావతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6, 7 తరగతులకు సంబంధించి బాలురకు కొప్పెర్ల గురుకులంలో.. బాలికలకు నెల్లిమర్ల గురుకులలో ఉదయం 10 గంటల నుంచి 11 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా 8, 9 తరగతులకు సంబంధించి బాలురకు కొప్పెర్లలో.. బాలికలకు నెల్లిమర్లలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు గంట ముందు కేంద్రానికి చేరుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 89858 83015, 63038 38657 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఐదో తరగతిలో ఉన్న ఖాళీలను ఎటువంటి ప్రవేశ పరీక్ష నిర్వహించకుండా కేటాయిస్తామని.. ఆసక్తి ఉన్న విద్యార్థులు జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ జంక్షన్లో ఉన్న సమన్వయకర్త అధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు.
లారీ బోల్తా ..
జామి: మండలంలోని అలమండ సమీపంలో ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. విశాఖపట్నం నుంచి రాయపూర్ వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్త్రెవర్కు స్పల్పగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రుడ్ని అలమండ పీహెచ్సీకి తరలించారు.
ట్రాక్టర్ బోల్తా – డ్రైవర్ మృతి
పార్వతీపురం రూరల్: మండలంలోని జిల్లేడువలస సమీపంలో ట్రాక్టర్ బోల్తాపడడంతో డ్రైవర్ మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా సమాచా రం అందుకున్న పోలీసులు మృతుడిని మక్కు వ మండలం ఎర్రసామంతవలస గ్రామానికి చెందిన మండంగి సుబ్బారావు(35) గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
విద్యుదాఘాతంతో
యువకుడి మృతి
తెర్లాం: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని డి.గదబవలస గ్రామం వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. దీనికి సంబంధించి ఎస్సై సాగర్బాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గంగన్నపాడు గ్రామానికి చెందిన పోరపు రామకృష్ణ (18) తెర్లాం నుంచి పెరుమాళి వైపు కొత్తగా వేసిన విద్యుత్ లైన్లో కూలి పనికోసం వెళ్తున్నాడు. సోమవారం కూడా విద్యుత్ స్తంభం ఎక్కి పని చేస్తుండగా.. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా రావడంతో స్తంభం పైనుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి తల్లిదండ్రులు, చెల్లి ఉన్నారు. మృతిడి తండ్రి సోదన్నదొర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శవపంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్సీకి తరలించారు.

మిగులు సీట్లకు రాతపరీక్ష రేపు