
‘తోటపల్లి’ నిర్వాసితులకు ఇళ్ల బిల్లులు చెల్లించాలి
పార్వతీపురం టౌన్: తోటపల్లి బ్యారేజీ నిర్వాసిత గ్రామాలైన పాతకల్లికోట, దుగ్గి గ్రామాలలో నిర్వాసితులు నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు వెంటనే చెల్లించాలని ఏపీ రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాసు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిర్వాసిత రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్ఓ కె.హేమలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్వాసితులు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇళ్లు నిర్మించుకున్నా ఇంతవరకు బిల్లులు చెల్లించలేదన్నారు. రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ.. నిర్వాసిత మహిళలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మహిళలకు ప్యాకేజీ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో దుగ్గి, పాతకల్లికోట, తోటపల్లి, పెద్దగెడ్డ నిర్వాసిత రైతులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు
బంటు దాసు