
ఓర్వలేకే మాజీ సీఎంపై కేసులు
రేగిడి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేకే కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఇటీవల పల్నాడులో పర్యటించిన సమయంలో చీలి సింగయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణించాడని, దీన్ని సాకుగా చూపి జగన్ మోహన్రెడ్డి, తదితరులపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. మండలంలోని బూరాడ గ్రామంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విషాదకరమైన ప్రమాదాలను కూడా రాజకీయం చేయడం తగదని సూచించారు. ప్రమాదవశాత్తూ జరిగిన మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. బస్సు ప్రమాదాల్లో ఎవరైనా మరణిస్తే డ్రైవర్పై కేసు నమోదు చేయడం పరిపాటని.. అంతేకాకుండా బస్సులో ప్రయాణిస్తున్న వారందరిపై కేసులు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు. పల్నాడు సంఘటనకు సంబంధించి లేనిపోని కథనాలను మీడియాలో చూపించి జగన్ మోహన్రెడ్డిని ఏ–2గా చేర్చడం విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, కరణం శ్రీనివాసరావు, కెంబూరు వెంకటేశ్వరరావు, వావిలపల్లి శశిభూషణరావు, బంకి చంద్రశేఖర్, టంకాల ఉమాపాపినాయుడు, రణస్థలం రమాదేవి, రాంబాబు, పిల్లా గౌరునాయుడు, దార గుర్నాథరావు, వైశ్యరాజు గోవిందరాజు, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్