
జీడి పిక్కల వ్యాపారి షాప్/ఇంటికి తాళాలు
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఎల్విన్పేట గ్రామానికి చెందిన జీడి పిక్కల వ్యాపారి షాప్, ఇంటికి బుధవారం గిరిజన, దళిత నాయకులు నిమ్మక సింహాచలం, అడ్డాకుల చిన్నారావు, ఎస్.రామారావు తదితరులు తాళాలు వేశారు. ఈమేరకు ఎల్విన్పేట జంక్షన్ వద్ద రవి ఏజెన్సీస్ పేరుతో కొన్నేళ్ల నుంచి వ్యాపారం చేస్తున్న జి.రవికుమార్ జీడిపిక్కలు, ధాన్యం విక్రయించిన వందల మంది రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు స్థానికంగా పలువురి నుంచి రూ.లక్షల్లో అప్పులు చేసి ఏవరికీ ఏమీ చెల్లించకుండా, ఏ సమాచారం ఇవ్వకుండా పరారయ్యాడు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వస్తోందని.. ఐపీ పెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడని తమకు రావాల్సిన డబ్బుల సంగతి ఏమిటంటూ పలువురు బాదితులు ఆ వ్యాపారి షాప్ ముందు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. పలువురి నుంచి రూ.2 కోట్లకుపైగా అప్పులు చేశాడని, తన ఇల్లు ,షాప్ను కూడా ఎవరికో రాసిపెట్టి వెళ్లిపోయాడన్న సమాచారం ఉందని, కావునే బాధితులందరికీ న్యాయం జరగాలన్న ఉద్ధేశంతో వ్యాపారి ఇల్లు , షాప్కు తాళం వేసినట్లు నాయకులు తెలియజేశారు. ఈ సంఘటణపై ఎల్విన్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని వారంతా పేర్కొన్నారు.