నువ్వెంతంటే నువ్వెంత..! | - | Sakshi
Sakshi News home page

నువ్వెంతంటే నువ్వెంత..!

May 3 2025 8:41 AM | Updated on May 3 2025 8:41 AM

నువ్వ

నువ్వెంతంటే నువ్వెంత..!

నెల్లిమర్ల రూరల్‌: నెల్లిమర్ల పోలీస్‌ స్టేషన్‌ అరుపులు, కేకలతో శుక్రవారం దద్దరిల్లింది. టీడీపీ నేతలు, ప్రాజెక్టు నిర్వాహకుల మధ్య మాటల యుద్ధం జరిగింది. నువ్వెంతంటే నువ్వెంత..! అంటూ అరుపులు, కేకలతో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ నెలకొంది. టీడీపీ నేతలు, ప్రాజెక్టు ప్రతినిధులు ఒకరిపైఒకరు భూతుల దండకం వినిపించారు. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఇరువర్గాలవారు వినిపించుకోలేదు. చివరకు ప్రాజెక్టు నిర్వాహుకులు పోలీసులకు ఫిర్యాదు చేసి వెనుదిరిగారు.

అసలేం జరిగిందంటే..!

తారకరామతీర్థ సాగర్‌ ముంపు గ్రామమైన కోరాడపేట పంట పొలాల్లో మట్టిని తవ్వేందుకు ప్రాజెక్టు నిర్వాహుకులు శుక్రవారం సన్నద్ధమయ్యారు. దీనిని స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. ముంపు గ్రామ నిర్వాసితులకు న్యాయం చేయకుండా పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు యంత్రాలతో పనులకు సిద్ధం కావడంతో స్థానికులు ప్రతిఘటించారు. తెలుగు భాష రాని ఇద్దరు కార్మికులపై స్థానికులు దాడి చేశారనేది ప్రాజెక్టు నిర్వాహుకుల ఆరోపణ. పనులు అడ్డుకున్న మహిళలపై కార్మికులు అణుచిత వ్యాఖ్యలు చేశారనేది టీడీపీ నేతల ఆరోపణ. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రాజెక్టు డీఈ, ఏఈతో పాటు కాంట్రాక్టర్‌ రంగారావు స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. పనులు చేస్తున్నవారిని స్థానికులు కొట్టారని, చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలోనే గ్రామస్తుల తరఫున టీడీపీ నేతలు గేదెల రాజారావు, పోతల రాజప్పన్న కూడా ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. అనంతరం ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుకున్నారు. తమ భూమిని ఎన్ని సంవత్సరాలు వాడు కుంటారని ప్రాజెక్టు డీఈ, కాంట్రాక్టర్‌ తీవ్ర స్థాయిలో ప్రశ్నించగా... పనికిమాలినోలంటూ.. ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

పోలీస్‌ స్టేషన్‌కు చేరిన టీఆర్‌టీఎస్‌ ప్రాజెక్టు పంచాయితీ

మట్టి తవ్వకాలను అడ్డుకున్న ముంపు గ్రామ నిర్వాసితులు

అరుపులు, కేకలతో దద్దరిల్లిన పోలీస్‌ స్టేషన్‌

న్యాయం చేసి పనులు చేయండి: నిర్వాసితులు

తమకు నెల్లిమర్ల పట్టణంలో నివాస స్థలాలు, ప్రభుత్వం తమ వద్ద తీసుకున్న భూమికి భూమి తిరిగి అప్పగించాలని కోరాడపేటకు చెందిన తారకరామతీర్థ సాగర్‌ ప్రాజెక్ట్‌ ముంపు గ్రామ నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. ఇదే విషయాన్ని గతంలో ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ప్రాజెక్టు నిర్వాహుకులు, అధికారులు మాత్రం తమకు సహకరించడం లేదని వాపోయారు. సర్వే నంబర్‌ 45, 54 లో ఉన్న తమ భూమిని ప్రభుత్వ భూమిగా గతంలో తప్పుగా నమోదుచేసి అన్యాయంగా ప్రాజెక్ట్‌కు అప్పగించారని వాపోయారు. తమకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాకే మట్టి తవ్వకాల పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కోరాడ అప్పలనాయుడు, రామునాయుడు, రామారావు, లక్ష్మి, శ్రీదేవి, ఆదిలక్ష్మి, గౌరి, చిన్నంనాయుడు, సీతారాంతో పాటు గ్రామానికి చెందిన 100 మంది నిర్వాసితులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పనులు మూడు నెలల్లో ఒక కొలిక్కి తీసుకురావాల్సి ఉందని, గట్టు నిర్మాణానికి సహకరించాలని ప్రాజెక్టు అధికారులు నిర్వాసితులను కోరారు.

నువ్వెంతంటే నువ్వెంత..! 1
1/1

నువ్వెంతంటే నువ్వెంత..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement