
భూసార పరీక్షలతో సత్ఫలితాలు
● విచ్చలవిడిగా రసాయన ఎరువుల వినియోగం
● క్రమేపీ సారం కోల్పోతున్న భూమి
● జిల్లాలో 28,425 మట్టి
నమూనాల సేకరణ లక్ష్యం
● ఇప్పటివరకు 17,373 నమూనాల సేకరణ
రైతులకు అవగాహన
భూసార పరీక్షలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.భూసార పరీక్షలు ఫలితాలను బట్టి రైతులు ఏ పంటలు వేసుకోవాలో తెలియజేస్తున్నాం. సాగుకు ఎంత మోతాదులో ఎరువులు వేసుకోవాలి. ఫలితాలు ఎలా వస్తాయే అంశాలను వివరిస్తున్నాం. – హరికృష్ణ,
మండల వ్యవసాయ అధికారి భోగాపురం
పూసపాటిరేగ: వ్యవసాయ సాగులో ఇష్టానుసారం రసాయన ఎరువులు వినియోగించడంతో భూములు సారం కోల్పోయి చౌడుభూములుగా మారుతున్నాయి. భూములు సారం కోల్పోవడంతో పంట దిగుబడులు తగ్గుతున్నాయి. నేల స్వభావం తెలుసుకోకుండా ఎరువులు వేసినా ఆశించిన ఫలితం ఉండదు. భూమి ఆరోగ్యం తగిన పోషకాలతో ఉన్నప్పుడే సత్ఫలితాలు సాధ్యం. ఎంత మోతాదులో ఎరువులు వేయాలో తెలుసుకోవాలన్నా భూసార పరీక్షలు తప్పనిసరి. భూసార పరీక్షల నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటే వ్యయభారాన్ని రైతులు తగ్గించుకోవచ్చు. పంటల్లో అధిక దిగుబడులు వచ్చినట్లయితే రైతులు ఆనందంగా ఉండవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దిగుబడి ఎక్కువ రావాలంటే ఏం చేయాలి, పెట్టుబడి ఎలా తగ్గించుకోవాలి అనే విషయాలపై రైతులు అవగాహన చేసుకోవాలి. నేలను ఆరోగ్యవంతంగా ఉంచడం, భూమిలో ఉన్న పోషకాలు, ఏ పంట సాగు చేయాలి, ఎరువులు ఎంత మోతాదులో వేయాలి అనే అంశాలను రైతులు తెలుసుకోవాలని చెబుతున్నారు. ఖరీఫ్ సాగును దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని మండలాల్లో వ్యవసాయ అధికారులు మట్టి నమూనాల సేకరణలో నిమగ్నమై ఉన్నారు. జిల్లాలో 28,425 మట్టి నమూనాల సేకరణ లక్ష్యం కాగా నేటివరకు 17,373 మట్టి నమూనాల సేకరణ జరిగింది, నెలిమర్ల నియోజకవర్గంలో 3450 మట్టి నమూనాల సేకరణను లక్ష్యంగా పెట్టుకుని 2438 వరకు సేకరించారు. కమతాల మధ్యలో 15 సెంటీమీటర్లు లోతులో గుంత తవ్వి మట్టి నమూనాలను సేకరిస్తున్నారు. ప్రతి ఆరున్నర ఎకరాలుకు ఒక నమూనా తీసుకుంటున్నారు. ఎనిమిది లేదా పదిచోట్ల సేకరించిన మట్టిని ఒక గోనె సంచిపై వేసి కలుపుతారు. దానిని నాలుగు భాగాలుగా చేసి ఎదురెదురుగా ఉన్న భాగాలను కలిపి అందులో అరకిలో చొప్పున మట్టిని సేకరించి భూసార పరీక్షా కేంద్రానికి పంపుతారు. అనంతరం భూసార పరీక్షలు ఫలితాల కార్డులును రైతులకు అందజేస్తారు. జీపీఎస్ ఆధారంగా సేకరించిన చిత్రాలను యాప్లో అప్లోడ్ చేసి ఫలితాల స్వభావాన్ని రైతుల సెల్ఫోన్కు తెలుగులో పంపిస్తారు.
ప్రారంభమైన నమూనాల సేకరణ
జూన్ నుంచి ఖరీఫ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆలోగానే మట్టి నమూనాలు సేకరించి ఫలితాలు అందించాలని వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే గ్రామాల్లో మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. భూమిలో ప్రధాన పోషకాలైన నత్రజని, బాస్వరం, పొటాష్ పరిమాణాల్లో మార్పులు గుర్తించవచ్చు. ఫలితాలు వచ్చిన తరువాత భూమిలో ఏ సూక్ష్మధాతువుల లోపం ఉందో తెలుసుకుని రైతులు ఎరువులు వినియోగించాలని, లేకుంటే నేల సారం కోల్పోయి దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.