
వైభవంగా కోదండ రామస్వామి వార్షిక కల్యాణం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని నీలాచలం పర్వతంపై ఉన్న కోదండ రామాలయంలో శ్రీ కోదండ రాముడి వార్షిక కల్యాణ మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. బహుళ దశమిని పురస్కరించుకుని ఏటా కొండపై ఆలయంలో కోదండుడి కల్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో స్వామికి వేకువజామున ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత స్వామివారి ఉత్సవ మూర్తులను ఆస్థాన మంటపంలో వేంచేపు చేసి కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా జరిపించారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.