విజయనగరం క్రైమ్: జిల్లాలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారిపై 64 సీసీ కెమరాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ చాంబర్లో బుధవారం హిట్ అండ్ రన్ జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. విజయనగరం డివిజన్లో వాహనాలు ఢీకొని మృతిచెందిన, క్షతగత్రులుగా మారిన మొత్తం 10 కేసులపై ఈ హిట్ అండ్ రన్ జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశంలో సమగ్రంగా చర్చించి ఆమోదించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే సమావేశం నాటికి మొత్తం పెండింగ్ కేసులన్నిటినీ పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలో మొత్తం 34 కిలోమీటర్ల మేర ఉన్న 16వ జాతీయ రహదారిపై 64 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు రూ.5లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. వాటిని అమర్చే పని వేగంగా పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్స్పాట్లు, నేరాలు జరిగే చోట్లను దశల వారీగా అన్నిచోట్లా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీని కోసం సమగ్ర సర్వే నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత, ఇన్చార్జి జేసీ ఎస్.శ్రీనివాసమూర్తి, డీటీఓ మణికుమార్, డీఎంహెచ్ఓ జీవనరాణి, ఆర్డీఓలు, డీఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్
హిట్ అండ్ రన్ కేసులకు ఆమోదం తెలిపిన కమిటీ