
డిజిటల్ దెబ్బ..దొంగల అబ్బా..!
చీపురుపల్లి: ఎంత నైపుణ్యం కలిగిన దొంగలైనా ప్రస్తుత రోజుల్లో డిజిటలైజేషన్ ముందు తలొగ్గాల్సిందే. విరివిగా దొంగతనాలు జరుగుతు న్నప్పటికీ పోలీస్శాఖలో పెరిగిన డిజిటలైజేషన్ కారణంగా ఆ చోరీలను ఛేదించడం సునాయాసమైంది. అందులో భాగంగానే చీపురుపల్లి పట్టణంలోని మెయిన్రోడ్లో శుక్రవారం అర్థరాత్రి జరిగిన చోరీతో పాటు వృద్ధులను గాయపరిచిన దుండగులు డిజిటలైజేషన్ పుణ్యమాని అతికొద్ది గంటల్లోనే పట్టుబడ్డారు. శుక్రవారం అర్థరాత్రి పట్టణంలోని మెయిన్రోడ్లో వారణాశి సురేష్ నివాసంలో 20 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లడంతో పాటు ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్ధులను తీవ్రంగా గాయపరిచిన సంఘటన తెలిసిందే. శనివారం ఉదయానికి ఈ సంఘటన పట్టణాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీంతో రంగంలోకి దిగిన డీఎస్పీ ఎస్.రాఘవులు నేతృత్వంలోని పోలీస్ అధికారులు డిజిటలైజేషన్ సహకారంతో దుండగులను పట్టుకున్నట్లు సమాచారం. చీపురుపల్లిలో చోరీకి పాల్పడిన దొంగలను తెనాలిలో పట్టుకుని జిల్లాకు తీసుకుంచ్చినట్లు తెలిసింది.
డిజిటలైజేషన్దే కీలకపాత్ర
దొంగలను పట్టించడంలో డిజిటలైజేషన్ కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా చోరీ జరిగిన ఇంటికి సమీపంలోని సెల్టవర్ పరిధిలో సమాచారాన్ని పోలీసులు సేకరించినట్లు తెలిసింది. చోరీ జరిగిన సమయంలో ఆన్లో ఉన్న ఫోన్ నంబర్లను సేకరించారు. దీంతో పాటు క్లూస్ బృందాలు సేకరించిన ఫింగర్ ప్రింట్స్తో మేచ్ అవడంతో తెనాలికి చెందిన ముఠాగా దుండగులను గుర్తించారు. వెంటనే గుంటూరు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో తెనాలి పోలీసులు వారిని పట్టుకున్నారు. అయితే చీపురుపల్లిలో చోరీకి పాల్పడిన దుండగులు విశాఖపట్నం చేరుకుని అక్కడి నుంచి జన్మభూమి రైలులో తెనాలి వెళ్లినట్లు తెలిసింది.
రెక్కీ చేసిన మహిళ కోసం..
ఇదిలా ఉండగా చీపురుపల్లిలో జరిగిన ఉదంతానికి ప్రధాన సూత్రధారిగా ఓ మహిళ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. చోరీ జరగడానికి మూడు రోజుల ముందే ఆ మహిళ చీపురుపల్లి చేరుకుని రెక్కీ నిర్వహించి ఇక్కడి ఇల్లు, పరిసరాల ఫొటోలు దుండగులకు పంపించినట్లు తెలిసింది. ఆ మహిళ వేసిన స్కెచ్ ప్రకారమే చోరీ అమలు చేసినట్లు సమాచారం. అయితే తెనాలిలో ఇద్దరు దుండగులు మాత్రమే పట్టుబడిన నేపథ్యంలో ఆ మహిళతో పాటు మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.
సెల్టవర్ లొకేషన్,
ఫింగర్ ప్రింట్స్ ద్వారా
నిందితుల గుర్తింపు
వైజాగ్ నుంచి జన్మభూమి రైలులో
ప్రయాణించిన దుండగులు
రెక్కీ నిర్వహించిన మహిళ కోసం గాలింపు
తెనాలిలో ఇద్దరు దొంగలను
పట్టుకున్న పోలీసులు
వారితో పాటు మరికొంత మంది ఉన్నట్లు సమాచారం