మహారాణిపేట: రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సోమవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో శాంతియుత నిరసనలు చేపట్టాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని కేకే రాజు మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఇంధన ధరలను తగ్గిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, ఇప్పుడు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ధరలకు పెట్రోలు, డీజిల్ విక్రయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ పెంపు వల్ల రవాణా రంగం, రైతాంగంతో పాటు సామాన్య ప్రజలపై నిత్యావసరాల రూపంలో అదనపు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో పార్టీ పార్లమెంట్ సభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ ప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల, వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కేకే రాజు పిలుపునిచ్చారు.


