పెదగంట్యాడ : యారాడ తీరంలో గురువారం గల్లంతైన ఇంటర్ విద్యార్థి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దిబ్బపాలెం గ్రామంలో కదిరి అప్పన్న కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఇతని కుమారుడు కదిరి వికాస్ (17) గాజువాకలోని ఓ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితుడు కదిరి భూలోకరాజుతో కలసి సరదాగా గడిపేందుకు గురువారం సాయంత్రం యారాడ తీరానికి వెళ్లాడు. బీచ్లో కాసేపు ఉత్సాహంగా గడిపిన తర్వాత స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. కెరటాల ఉధృతికి ఇద్దరు సముద్రంలో కొట్టుకుపోతుండగా అక్కడే ఉన్న కోస్ట్గార్డ్స్ గమనించి కాపాడే ప్రయత్నం చేయగా కదిరి భూలోకరాజును పట్టుకుని ఒడ్డుకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో వికాస్ గల్లంతయ్యాడు. దీంతో పోలీసులు సముద్రంలో గాలించగా శుక్రవారం ఉదయం యారడ తీరంలో ఆ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటనపై న్యూపోర్టు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


