మహారాణిపేట: ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు, యువజన, విద్యార్థి విభాగ నాయకులను టార్గెట్ చేస్తూ పోలీసులు అక్రమ కేసులతో వేధిస్తున్నారని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం కృష్ణ ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో యువత పట్ల చంద్రబాబు ప్రభుత్వం అత్యంత పాశవికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే, వారిపై అక్రమ కేసులు నమోదు చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కర్నూలులో వైఎస్సార్ సీపీ యువజన విభాగం సిటీ అధ్యక్షుడు బాలును టార్గెట్ చేసి తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్న బాలాంజనేయులుపై ఎస్సీ, ఎస్టీ కేసులతో పాటు ఎన్నికల సమయంలో కారులో మద్యం పెట్టి తప్పుడు కేసులు నమోదు చేశారని అన్నారు. ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా టీడీపీ నేతల ఒత్తిళ్లకు లోనై పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసుల నిరంతర వేధింపులను తట్టుకోలేక బాలాంజనేయులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడే పరిస్థితి ఏర్పడిందని కరణం కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.


