వేట లేదు.. పూట గడవదు
మహారాణిపేట: అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్), మిలాన్–2026 కార్యక్రమాల నేపథ్యంలో ఈనెల 14 నుంచి 21 వరకు సముద్రంలో చేపల వేటకు నేవీ, మత్స్యశాఖ అధికారులు ఆంక్షలు విధించడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎనిమిది రోజులుగా వేట నిలిచిపోవడంతో వేలాది కుటుంబాలు ఆదాయం లేక అల్లాడుతున్నాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్తో పాటు భీమిలి, రుషికొండ, పెదజాలారిపేట, లాసన్స్ బే తదితర తీర ప్రాంతాల్లో బోట్లు ఒడ్డుకే పరిమితమయ్యాయి. జిల్లాలో 32 కిలోమీటర్ల తీరప్రాంతం, 32 మత్స్యకార గ్రామాలు, 15 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు ఉన్నాయి. 667 మరపడవలు, 3,094 మోటారు బోట్లు, 611 సాంప్రదాయ తెప్పలతో వేలాది మంది వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. సుమారు 1.5 లక్షల మత్స్యకార జనాభా ఉండగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి పైగా ఈ వృత్తిపై ఆధారపడినట్లు అధికారులు తెలిపారు. వేట నిలిపివేతతో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయని, తక్షణ ఆర్థిక సహాయం అందించాలని మత్స్యకార సంఘాలు కలెక్టర్కు వినతిపత్రాలు సమర్పించాయి. కొంత నగదు, బియ్యం, నిత్యావసర సరుకుల రూపంలో సహాయం చేయాలని మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ నాయకుడు వాసుపల్లి జానకీరామ్ కోరారు.


