క్వార్టర్‌ ఫైనల్స్‌కు స్పోర్ట్స్‌ ఎలెవెన్‌ | - | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్స్‌కు స్పోర్ట్స్‌ ఎలెవెన్‌

Feb 19 2026 10:04 AM | Updated on Feb 19 2026 10:04 AM

క్వార్టర్‌ ఫైనల్స్‌కు స్పోర్ట్స్‌ ఎలెవెన్‌

క్వార్టర్‌ ఫైనల్స్‌కు స్పోర్ట్స్‌ ఎలెవెన్‌

విశాఖ స్పోర్ట్స్‌: వీడీసీఏ డీఎస్సార్‌ స్మారక ట్రోఫీలో స్పోర్ట్స్‌ ఎలెవెన్‌ జట్టు క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకుంది. బుధవారం వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ బి గ్రౌండ్‌లో జరిగిన ప్రీ క్వార్టర్‌ ఫైనల్స్‌లో మూన్‌స్టార్స్‌ సీసీపై ఏకంగా 116 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన స్పోర్ట్స్‌ ఎలెవెన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఖాసీమ్‌ (90) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... జయంత్‌ (45), ఓపెనర్‌ రంగరామానుజన్‌ (35), రవి (30) రాణించారు. బౌలింగ్‌లో రఘు మూడు వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన మూన్‌స్టార్స్‌ సీసీ 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో సాయిచైతన్య (43) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. స్పోర్ట్స్‌ ఎలెవెన్‌ బౌలర్లు యశ్వంత్‌, రిషి చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

పురుషుల జట్టుతో మహిళా జట్టు పోరు

మరో మ్యాచ్‌లో నిరుటి రన్నరప్‌ ఆశ్రయ సీసీ(మెన్‌).. ఆల్‌స్టార్స్‌ మహిళా జట్టుతో తలపడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆశ్రయ సీసీ 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు సాధించింది. 46 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో ఓపెనర్‌ మణికంఠ (76), రవికుమార్‌ (89) ఆదుకున్నారు. మహిళా బౌలర్లలో ఆయుషి రెండు వికెట్లు తీయగా.. తన్మయి, సంజన చెరో వికెట్‌ దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆల్‌స్టార్స్‌ మహిళా సీసీ 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులే చేసింది. 26 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో.. యుహాసిని (39), కెప్టెన్‌ తన్మయి (26) పోరాడారు. వైష్ణవి డకౌట్‌ కాగా, మిగిలిన వారంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. కాగా, ఆశ్రయ సీసీ బౌలర్లు ఏకంగా 31 పరుగులను ఎక్స్‌ట్రాల రూపంలో సమర్పించుకున్నారు. బౌలింగ్‌లోనూ రాణించిన మణికంఠ 5 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement