జనారణ్యంలోకి కనుజు
ఆరిలోవ: జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న విశాఖ వాలీ రోడ్డులో బుధవారం ఓ కనుజు సంచరించింది. ఈ రోడ్డుకు ఇరువైపులా జూ పార్కు, సీతకొండలు ఉన్నాయి. ఈ కొండల్లో వందల సంఖ్యలో చుక్కల జింకలు, కనుజులు, అడవి పందులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. ఇవి మేత, దాహం తీర్చుకోవడానికి తరచూ సాగర్నగర్, విశాలాక్షినగర్ వంటి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే బుధవారం సాయంత్రం పెద్ద కొమ్ములు కలిగిన ఓ కనుజు విశాఖ వాలీ స్కూల్ రోడ్డులోకి ప్రవేశించింది. అది రద్దీగా ఉన్న వాహనాల మధ్య నుంచి రోడ్డు దాటుకుంటూ సీతకొండలోకి చేరుకుంది. రోడ్డుపై సంచరించిన ఆ కనుజును పలువురు ఆసక్తిగా తమ సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు.


