శ్మశాన వాటిక దారి కోసం ‘శవయాత్ర’
మద్దిలపాలెం: తరతరాలుగా వాడుతున్న శ్మశాన వాటికకు దారి కల్పించకపోవడాన్ని నిరసిస్తూ పాత, కొత్త వెంకోజిపాలెం గ్రామస్థులు సోమవారం ఉదయం వినూత్నంగా ఆందోళన చేపట్టారు. శ్రీ సీతారామ సేవా సంఘం, గ్రామ సేవా సంఘం సభ్యులు అందరూ ఏకమై రోడ్డుపై శవయాత్ర నిర్వహించి, అనంతరం వంటా–వార్పు కార్యక్రమంతో తమ నిరసనను వ్యక్తం చేశారు.శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో తమ పూర్వీకుల నాటి శ్మశానానికి దారి లేకపోవడం దారుణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులే స్వచ్ఛందంగా నిధులు సేకరించి సీసీ రోడ్డును నిర్మించుకున్నారు. అయితే ఈ భూమి కోర్టు పరిధిలో ఉందని, రోడ్డు వేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ దేవస్థానం అధికారులు రోడ్డు వేసిన వారిపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.రోడ్డును తొలగిస్తామని అధికారులు బెదిరించడంతో.. మహిళలు, యువకులు, పెద్దలు భారీ సంఖ్యలో శ్మశాన వాటిక వద్దకు చేరుకున్నారు. అక్కడే వంటలు చేసుకుని భోజనాలు చేసి నిరసన తెలిపారు. అనంతరం దారి లేని దుస్థితిని ప్రభుత్వానికి వివరించేందుకు.. తాము వేసుకున్న రోడ్డుపైనే ఒక బొమ్మతో శవయాత్ర నిర్వహించి, దానికి దహన సంస్కారాలు చేశారు. మా ఆస్తులను కోల్పోయినా పర్వాలేదు కానీ, కనీసం అంతిమ సంస్కారాలకు గౌరవప్రదమైన దారిని కూడా అడ్డుకోవడం దుర్మార్గమని గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా జీవీఎంసీ, దేవస్థాన అధికారులు స్పందించి శ్మశాన వాటిక దారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
వెంకోజిపాలెంలో వినూత్న నిరసన


