కనులపండువగా దుర్గాలమ్మ జాతర
డాబాగార్డెన్స్: వెలంపేటలో వెలసిన దుర్గాలమ్మ వార్షిక జాతర మహోత్సవాల్లో భాగంగా మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. భవానీ మాలలు వేసిన మాతలు తలపై కలశాలు పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి విచ్చేసి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అభిషేకించారు. అర్ధరాత్రి 12 గంటలకు అమ్మవారి నేత్రోత్సవం, తొలిపూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారి జాతర సోమవారం పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్టు ఈవో శేఖర్బాబు పేర్కొన్నారు. వచ్చేవారం మారువారాన్ని పురస్కరించుకుని 108 రకాల వంటకాలతో అమ్మవారికి నివేదించిన అనంతరం భక్తులకు ప్రసాదంగా అందజేయనున్నారు. నివేదించనున్నారు.
సందడే సందడి..
మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా కల్లుపాకలు, దుర్గాలమ్మ గుడి ఏరియా, వెలంపేట, ప్రసాద్గార్డెన్స్, పండావీధి, పెరికివీధి, రాజారామ్మోహన్రాయ్రోడ్డు తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కలశాలు, పూల ఘటాలతో ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవాల్లో పులులు, దశావతారాల్లో దుర్గమ్మ, సింహాద్రి అప్పన్న, కోలాటం, అష్టదుర్గలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు భవానీలు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఇదిలా ఉండగా రాత్రి 9 గంటల నుంచి పలు వీధుల్లో ఆర్కెష్ట్రాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలు స్వచ్ఛంద సంస్థలు ఉచిత ప్రసాదం, మజ్జిగ పంపిణీ చేశాయి.
కనులపండువగా దుర్గాలమ్మ జాతర


