మోదీ ఇజ్రాయెల్ పర్యటన విరమించుకోవాలని ఆందోళన
బీచ్రోడ్డు: పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు మానవత్వానికే మచ్చ అని, ఈ దాడులను నిరసిస్తూ ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటను విరమించుకోవాలని ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీనా కార్యకర్తలు డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన బోర్డ్ ఆఫ్ పీస్, ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనని నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. రెండేళ్లుగా జరిపిన హత్యాకాండలో ఇజ్రాయెల్ 70 వేల మందికి పైగా పాలస్తీనా ప్రజలను హత్య చేసిందన్నారు. సీజ్ ఫైర్ అమల్లో ఉన్న ఈ ఐదు నెలల్లో ఇజ్రాయెల్ దురాక్రమణ సైన్యం 500 మందికి పైగా పాలస్తీనియన్లను హత్య చేసిందన్నారు. పాలస్తీనా ప్రజల ఆకాంక్షలతో సంబంధం లేకుండా, అక్కడ శాంతి నెలకొల్పుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత ఏడాది బోర్డ్ ఆఫ్ పీస్ ఏర్పాటు చేశారని. అందులో పాల్గొనమని భారత్కు కూడా ఆహ్వానం అందిందన్నారు. పాలస్తీనా ప్రజల భవిష్యత్తును నిర్ణయించే అధికారం ఆ బోర్డుకు ఎంత మాత్రం లేదన్నారు. పాలస్తీనా దురాక్రమణను చట్టబద్ధం చేసేందుకు, పశ్చిమాసియాలో యూఎస్–ఇజ్రాయల్ సామ్రాజ్యవాద శక్తిని దృఢపరిచేందుకే ఉపయోగపడుతుందన్నారు. భారత ప్రభుత్వం ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో చేరేందుకు వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించాలని డిమాండ్ చేశారు.


