
కొత్త వెలుగులేవీ..?
విశాఖలో పడకేసిన పర్యాటకాభివృద్ధి
ఏడాదిన్నర పాలనలో ఒక్క ప్రాజెక్టూ తీసుకురాని కూటమి సర్కారు
కై లాసగిరిపై గ్లాస్ బ్రిడ్జికి వైఎస్సార్సీపీ హయాంలోనే అంకురార్పణ
కూటమి వచ్చిన తర్వాత ప్రైవేట్ చేతుల్లో పర్యాటక భవనాలు
నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం
నాటి మెరుపులే తప్ప..
సాక్షి, విశాఖపట్నం: ‘పర్యాటక రాజధానిగా’ విశాఖను మారుస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా టూరిజం రంగాన్ని గాలికొదిలేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తయి పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయే తప్ప, కూటమి వచ్చాక ఒక్క కొత్త టూరిజం ప్రాజెక్టు అయినా పట్టాలెక్కకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కొత్త మెరుపులు లేకుండానే మరో పర్యాటక దినోత్సవం ముగిసిపోతోందని పర్యాటక ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీఐఎస్–2023 సదస్సులో రూ. 8,806 కోట్ల విలువైన 66 టూరిజం ప్రాజెక్టులకు సంబంధించిన ఎంవోయూలను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సింగపూర్, టర్కీ, ఫ్రాన్స్ వంటి దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించిన ఈ ప్రాజెక్టులు పడకేయడంతో విశాఖకు ప్రపంచ పర్యాటక పటంలో లభించాల్సిన స్థానం చేజారిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు కూటమి నాయకులు ఉన్న భూములను కొల్లగొట్టేందుకు పీపీపీ పేరుతో స్కెచ్లు వేస్తున్నారే తప్ప, కొత్తగా అభివృద్ధి చేయడం లేదన్న విమర్శలున్నాయి.
2024 ఏప్రిల్లోనే గ్లాస్ బ్రిడ్జికి ఎల్వోఏ
కై లాసగిరిపై నిర్మాణం పూర్తయిన గ్లాస్ బ్రిడ్జ్ ప్రాజెక్టు తమ ఘనతేనని కూటమి నేతలు ప్రచారం చేస్తుండగా, వాస్తవానికి ఈ ప్రతిపాదన 2022లో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చిందే. 2024 జనవరిలో పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్టుకు ఎల్వోఏ ఇచ్చారని, ఇప్పుడు పనులు పూర్తవడంతో ఆ క్రెడిట్ కూటమి తన ఖాతాలో వేసుకుంటోంది.
రూ. వేల కోట్ల భూములపై నేతల కన్ను
మరోవైపు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలు చేయకుండా, ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని రూ. వేల కోట్ల విలువైన పర్యాటక భూములను తమ అనుచరులకు కట్టబెట్టేందుకు కూటమి నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. యాత్రినివాస్ వంటి భవనాలను ఇప్పటికే పీపీపీ పేరుతో ప్రైవేట్కు అప్పగించింది. తమ నియోజకవర్గాల పరిధిలోని విలువైన పర్యాటక భూములను అనుచరులకు కట్టబెట్టడానికి కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు. విశాఖ జిల్లాలో 176.15 ఎకరాలు, అనకాపల్లి జిల్లాలో 22.67 ఎకరాలు, అల్లూరి జిల్లాలో 43.10 ఎకరాలు చొప్పున మొత్తం 241.92 ఎకరాల్ని కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. త్వరలోనే కూటమి నేతల అనుచరులకు టూరిజం ప్రాజెక్టుల పేరుతో భూపందేరం జరగనుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచే మార్గా లను అన్వేషించకుండా.. ఉన్న భూములను కూటమి నాయకులకు ధారాదత్తం చేసేందుకు.. ప్రభుత్వ పెద్దలు ఎవరికి చెబితే.. వారికి భూ కేటాయింపులు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కుదిరిన రూ. వేల కోట్ల ఒప్పందాలను పక్కన పెట్టి, భూములను కూటమి నేతల అనుచరులకు ధారాదత్తం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం.
అవకాశాలున్నా.. ఆలోచన సున్నా.!
మాటల్లోనే విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారే తప్ప.. వాస్తవ రూపం దాల్చేలా ఒక్క అడుగు కూడా కూటమి ప్రభుత్వం వెయ్యడం లేదు. గత ప్రభుత్వం హయాంలో ఒప్పందం ప్రకారం అన్నవరంలో ఒబెరాయ్, మై ఫెయిర్ హోటల్స్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ తరహా ఒప్పందం ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం చెయ్యలేదు. విశాఖ నగరంలో పర్యాటక వనరులు కోకొల్లలుగా ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా.. పీపీపీ పద్ధతిలో భూములు కట్టబెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తుందే తప్ప.. కొత్త ఆలోచనల్ని అమలు చెయ్యడంలో పూర్తిగా విఫలమయ్యింది.
నేడు పర్యాటక సంబరాలు
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా.. జిల్లాలో ప్రత్యేక సంబరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి జె.మాధవి తెలిపారు. వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో విశాఖపట్నం హోటల్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామన్నారు. మర్చెంట్ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
త్వరలో మరో హిప్హాప్ బస్సు
ఉమ్మడి విశాఖలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇప్పటికే బీచ్రోడ్డులో రూ.5 కోట్లతో రెండు హిప్హాప్ బస్సులు నడుపుతున్నాం. త్వరలోనే మరో హిప్హాప్ బస్సు పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నాం. రుషికొండ, జోడుగుళ్ల పాలెం, భీమిలి బ్యాక్ వాటర్లో వాటర్స్పోర్ట్స్, కయాకింగ్, స్కూబాడైవింగ్ మొదలైనవి అందుబాటులోకి రాబోతున్నాయి. విశాఖ, అరకు క్యారవాన్స్ తీసుకొస్తున్నాం. టూరిజం హోటల్స్కు టెండర్లు వేశాం. త్వరలోనే వైజాగ్లో 2 వేల రూమ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. స్పోర్ట్స్ టూరిజం, ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం ప్రణాళికలు తయారు చేస్తున్నాం.
– జీవీబీ జగదీష్, ఏపీటీడీసీ డీవీఎం
ప్రపంచ స్థాయి హోటల్స్తో పర్యాటకుల తాకిడి
ఈ ఏడాది టూరిజం డేని పర్యాటకంలో స్థిరమైన, సమగ్రాభివృద్ధి అనే థీమ్తో నిర్వహిస్తున్నాం. పర్యాటక రంగంలో హాస్పిటాలిటీ ప్రధాన పాత్రపోషిస్తోంది. ప్రపంచస్థాయి హోటల్స్ రాబోతుండటంతో.. విశాఖకు సందర్శకుల తాకిడి రెట్టింపయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖకు వచ్చే పర్యాటకుల సంఖ్య ప్రస్తుతం కోటికి పైగా ఉంది. ఇది రెట్టింపు చేసుకునే అవకాశాలు బోలెడు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. భవిష్యత్తులో విశాఖకు విమానాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ విమానాల సంఖ్య పెరిగితే మెడికల్ టూరిజం, స్పిరిచ్యువల్ టూరిజం అభివృద్ధి చెందనున్నాయి.
– పవన్ కార్తీక్, ఏపీ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్

కొత్త వెలుగులేవీ..?

కొత్త వెలుగులేవీ..?