అందరూ దోషులే! | - | Sakshi
Sakshi News home page

అందరూ దోషులే!

Sep 27 2025 4:27 AM | Updated on Sep 27 2025 4:27 AM

అందరూ

అందరూ దోషులే!

● అక్రమ మైనింగ్‌కు కొమ్ముకాస్తున్న అధికారులు ● కూటమి నేతల ధనదాహానికి ప్రజల ప్రాణాలు హరి ● భారీ రాళ్ల తరలింపుతో రోడ్లు ఛిద్రం ● పక్క జిల్లా నుంచి వస్తున్నా పట్టించుకునే వారేరీ ● మైనింగ్‌, పోలీసు, రవాణా అధికారులకు భారీగా ముడుపులు

ఈ ఏడాది మార్చి 25న అనకాపల్లి టౌన్‌లో విజయరామరాజు పేట వద్ద గల రైల్వే అండర్‌ బ్రిడ్జి గడ్డర్‌ను క్వారీ లారీ ఢీకొనడంతో భారీ ప్రమాదం తప్పింది. దీంతో రైల్వే గడ్డర్‌ పాక్షికంగా దెబ్బతింది.

ఈ ఏడాది మార్చి 16వ తేదీన మునగపాకకు చెందిన టీడీపీ కార్యకర్త, ఎల్‌ఐసీ ఏజెంట్‌ గన్నారావు మైనింగ్‌ టిప్పరు గుద్ది ప్రాణాలు కోల్పోయారు. కంటితుడుపుగా కేసు పెట్టడం మినహా రోజువారీగా అక్రమ మైనింగ్‌, అధిక లోడు వాహనాల విషయంలో తనిఖీలు మాత్రం జరగడం లేదు.

ఇవే కాదు ప్రతి సోమవారం గ్రీవెన్స్‌ సెల్‌కు అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ అటు మైనింగ్‌ అధికారులు కానీ... ఇటు రవాణాశాఖ, పోలీసు, రెవెన్యూ అధికారులు గానీ చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించడం లేదు. ప్రతి నెలా ఆయా విభాగాలకు ఠంచనుగా మామూళ్లు అందుతుండటమే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా కూటమి నేతల ధనదాహం, అధికారుల అలసత్వం వెరసి ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది.

అక్రమ మైనింగ్‌ కోసం అనుమతి లేకుండా మైనింగ్‌ మాఫియా వేసుకున్న రహదారి. ఎటువంటి అనుమతి లేకున్నా రోడ్డు నిర్మిస్తుంటే... పదే పదే గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే తప్ప అటువైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అనకాపల్లి జిల్లా మైనింగ్‌ అవకతవకలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. శుక్రవారంనాటి తాజా సంఘటననే ఇందుకు ఉదాహరణ. వాస్తవానికి రాంబిల్లి మండలంలోని కొండవారిపాలెం వద్ద రెండు బండరాళ్లను విడిచిన టిప్పర్లు పక్క జిల్లా కాకినాడ నుంచి వస్తున్నాయి. తుని, పాయకరావుపేట, నక్కపల్లి, యలమంచిలి నియోజకవర్గాలను దాటుకుని రాంబిల్లి వద్ద జరుగుతున్న నావికాదళ పనుల కోసం ఈ బండరాళ్లను తరలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని పోలీసు, రవాణా, మైనింగ్‌ అధికారులు తనిఖీలు జరిపితే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించే వీలుంటుంది. ప్రతి రోజూ పక్క జిల్లా నుంచి పదుల సంఖ్యలో అధిక లోడుతో టిప్పర్లు వస్తున్నప్పటికీ ఆయా స్టేషన్ల పరిధిలోని పోలీసు, రవాణా శాఖల సిబ్బంది పట్టించుకోవడం లేదు. ప్రతి నెలా భారీగా అందుతున్న మామూళ్లే ఇందుకు కారణమని వేరే చెప్పనక్కరలేదు.

అధిక లోడుతో చక్కర్లు...!

అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌తో టిప్పర్లు అధికలోడుతో వెళుతున్నాయి. తద్వారా రోడ్లన్నీ ఛిద్రమవుతున్నాయి. ఇప్పటికే అనేకసార్లు ప్రమాదాలు కూడా జరిగాయి. కొంత మంది ప్రాణాలను కూడా బలితీసుకున్నాయి. అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న వివిధ క్వారీల ద్వారా రోజువారీ 1,000 ట్రిప్పుల బండరాళ్లను మునగపాక మీదుగా రోడ్లపై భారీ శబ్దాలు చేస్తూ రాంబిల్లిలోని నావికాదళ పనుల కోసం తరలిస్తున్నారు. 32–36 టన్నుల సామర్ధ్యం కలిగిన టిప్పర్లల్లో ఏకంగా 50 టన్నుల మేరకు భారీ బండరాళ్లు వేసుకుని తిరుగుతున్నా అటు మైనింగ్‌ అధికారులు కానీ, ఇటు రవాణాశాఖ, పోలీసు, రెవెన్యూ అధికారులు కానీ కనీసం కన్నెత్తి చూడటం లేదు.

అక్రమ సంపాదన నెలకు రూ.2 కోట్లు

ఒక్కో ట్రిప్పునకు నెలకు రూ.22 వేల చొప్పున కూటమి నేతలు ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నెలవారీ వసూలవుతున్న మొత్తం రూ.2 కోట్లకు పైమాటే. కూటమి నేతలతోపాటు మైనింగ్‌, రవాణా, పోలీసు, రెవెన్యూ అధికారులకూ భారీగా వాటాలు అందుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రవాణాశాఖ అధికారులు అధిక లోడుతో వెళుతున్న వాహనాలను చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారు. అనధికారిక క్వారీల్లో జరుగుతున్న మైనింగ్‌ను పట్టించుకోకుండా ఉండేందుకుగానూ మైనింగ్‌ అధికారులకూ భారీగా ముడుతోందన్న విమర్శలున్నాయి. అక్రమ మైనింగ్‌తో పాటు అధిక లోడుతో భారీగా రాయల్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. ఇక మైనింగ్‌ విజిలెన్స్‌ అధికారులు కనీసం ఒక్కటంటే ఒక్కసారి కూడా దాడులు చేసి అక్రమ మైనింగ్‌ను నిలిపివేసేందుకు గత 6 నెలల కాలంలో ప్రయత్నించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు స్థానిక పోలీసు, రెవెన్యూ, విజిలెన్స్‌ ఇలా అన్ని విభాగాల అధికారులకు వాటాల లెక్కన పంచుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాలన్నీ కూటమి నేత బంధువు దగ్గరుండీ మరీ చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరి వాటా వారికి ఇచ్చిన తర్వాత మిగిలిన మొత్తం భారీ స్థాయిలో సదరు కూటమి నేత బంధువు జేబులోకి వెళుతోంది.

నేరుగా వాయిస్‌ మెసేజ్‌లు ఉన్నా...

‘‘ఈ నెల 10వ తేదీలోగా నా వద్దకు వచ్చి... కన్ఫర్మ్‌ చేసుకోండి. 10వ తేదీన జాబితా సిద్ధమవుతుంది. 11వ తేదీ నుంచి ఎవరైనా పట్టుకుంటే నాకు సంబంధం లేదు. ఫోన్‌ పేలు ఎవ్వరూ చేయవద్దు’’ ఇది అనకాపల్లి జిల్లాలో అధిక లోడుతో వెళుతున్న, అనుమతి లేని వాహనాల విషయంలో వసూళ్లకు సంబంధించిన ఆడియో మెసేజ్‌. ఈ ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అసలు ఏ శాఖకు సంబంధం లేని ఒక ప్రైవేటు వ్యక్తి ధైర్యంగా ట్రాన్స్‌పోర్టు యాజమాన్యాలకు ఆడియో మెసేజ్‌లు పంపి వసూళ్లకు తెగబడుతున్నాడంటే... సదరు వ్యక్తికి ఎంతమేర అధికారుల నుంచి అండదండలున్నాయో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ప్రతి నెలా లారీకి ఇంత చొప్పున అటు మైనింగ్‌, ఇటు ఫ్లై యాష్‌.... అంతేకాకుండా సెజ్‌లకు వెళ్లే బస్సుల యాజమాన్యాలు రవాణాశాఖ అధికారులకు పైకం చెల్లించాలి. లేని పక్షంలో దాడులు చేసి కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ వ్యవహారమంతా ఒక ప్రైవేటు వ్యక్తి ద్వారా రవాణాశాఖ అధికారులు నడిపిస్తున్నారనే విమర్శలున్నాయి.

అందరూ దోషులే!1
1/2

అందరూ దోషులే!

అందరూ దోషులే!2
2/2

అందరూ దోషులే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement