
ఈపీడీసీఎల్ సీవోవోగా మరోసారి కింజరాపు
సాక్షి, విశాఖపట్నం : ఏపీఈపీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ అధికారి(సీవీవో)గా రిటైర్డ్ ఎస్పీ కింజరాపు వెంకట రామకృష్ణప్రసాద్ను మరోసారి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 ఆగస్ట్ నుంచి ఈ ఏడాది జూలై 31 వరకూ సీవీవోగా విధులు నిర్వర్తించారు. మరోసారి కాంట్రాక్టు పద్ధతిలో మరో ఏడాదిపాటు నియమిస్తున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎండీ పృథ్వీతేజ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విజిలెన్స్ విభాగంలో సీవీవోగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
25న తపాలా అదాలత్
ఎంవీపీకాలనీ : తపాలా వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి ఈ నెల 25న ఎంవీపీకాలనీలోని రీజనల్ కార్యాలయంలో 119వ తపాలా అదాలత్ నిర్వహించనున్నట్లు రీజనల్ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ కేవీడీ సాగర్ తెలిపారు. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన తపాలా వినియోగదారులు వారి సమస్యలను ఈ నెల 22లోపు అందజేయాలన్నారు.