
షాక్!
ఫిరాయింపు కార్పొరేటర్లకు
● పార్టీ ఫిరాయించిన 27 మంది వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ● విప్ ధిక్కరించి ‘మేయర్’అవిశ్వాసంలో కూటమికి ఓటు ● వైఎస్సార్ సీపీ ఫిర్యాదుకుస్పందించని ఎన్నికల అధికారి ● హైకోర్టును ఆశ్రయించడంతో ఎట్టకేలకు నోటీసుల జారీ
డాబాగార్డెన్స్: వైఎస్సార్ సీపీ గుర్తుపై పోటీ చేసి విజయం సాధించారు. స్వార్థ రాజకీయాలు, డబ్బులకు ఆశపడి 27 మంది కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించారు. పార్టీ విప్ను ధిక్కరించి మేయర్పై అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేశారు. ఇప్పుడు ఆ 27 మంది కార్పొరేటర్ల రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ వ్యవహారంపై వైఎస్సార్ సీపీ హైకోర్టును ఆశ్రయించడంతో.. ఎన్నికల అధికారి ఎట్టకేలకు ఆ 27 మందికి నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేయడంతో ఫిరాయింపు కార్పొరేటర్లలో ఆందోళన మొదలైంది.
అసలేం జరిగిందంటే..: 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో 98 వార్డులకు గాను 59 స్థానాలను వైఎస్సార్ సీపీ గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. టీడీపీ 29, జనసేన 3 స్థానాలతో పాటు స్వతంత్రులు గెలిచారు. బీసీ జనరల్కు రిజర్వ్ అయిన మేయర్ పదవిలో యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకటకుమారిని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో జీవీఎంసీని కై వసం చేసుకునేందుకు టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పావులు కదిపింది. మెజారిటీ లేనప్పటికీ వైఎస్సార్ సీపీకి చెందిన 27 మంది కార్పొరేటర్లను డబ్బు, పదవుల ఆశ చూపి తమ వైపు తిప్పుకుంది. వీరిలో కొంత మంది టీడీపీ, మరికొందరు జనసేనలో చేరారు. ఈ ఏడాది ఏప్రిల్ 19న మేయర్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్లో.. ఈ 27 మంది కార్పొరేటర్లు వైఎస్సార్ సీపీ జారీ చేసిన విప్ను ధిక్కరించారు. మేయర్కు వ్యతిరేకంగా ఓటు వేశారు.
చట్టపరమైన పోరాటం
పార్టీ ఆదేశాలను ధిక్కరించిన కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ విప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తైనాల విజయ్కుమార్ ఏప్రిల్ 22న జిల్లా ఎన్నికల అధికారి, అప్పటి జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. 2008 మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని రూల్ నం.9 ప్రకారం, పార్టీ గుర్తుపై గెలిచిన సభ్యులు విప్ను ధిక్కరిస్తే వారి సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం ఉంటుందని అందులో పేర్కొన్నారు. అయితే వారం రోజు ల్లోగా వారికి ఇవ్వాల్సిన నోటీసులు జారీ కాలేదు. మరోవైపు మేయర్ ఎన్నిక సమయంలో కౌన్సిల్ సమావేశ మినిట్స్ కాపీని ఇవ్వాలని వైఎస్సార్ సీపీ రెండుసార్లు కోరినా ఎన్నికల అధికారి స్పందించలేదు. దీనిపై తైనాల ఈ నెల 9న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం జరిగిన విచారణలో ‘కార్పొరేటర్లకు నోటీసులు జారీ చేశారా?’ అని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనికి సమాధానంగా రెండు రోజుల కిందటే నోటీసులు ఇచ్చామని ఎన్నికల అధికారి తెలిపారు. కార్పొరేటర్లు ఇచ్చే సమాధానం ఆధారంగా పూర్తిస్థాయి నివేదిక అందజేస్తామన్నారు.
నోటీసులు అందుకున్న కార్పొరేటర్లు వీరే..
ముత్తంశెట్టి ప్రియాంక (6వ వార్డు), లొడగల అప్పారావు (8వ వార్డు), కెల్ల సునీత (13వ వార్డు), గేదెల లావణ్య (17వ వార్డు), గుడ్ల విజయసాయి (23వ వార్డు), సారిపల్లి గోవింద రాజుల వెంకట అప్పారావు(25వ వార్డు), ఉరుకూటి నారాయణరావు (29వ వార్డు), కోడూరు అప్పలరత్నం(30వ వార్డు), మాసిపోగు మేరీ జోన్స్(36వ వార్డు), ఆళ్ల లీలావతి (42వ వార్డు), పెద్దిరెడ్డి ఉషశ్రీ (43వ వార్డు), కంపా హనోక్ (45వ వార్డు), కంటిపాము కామేశ్వరి (47వ వార్డు), చల్లా రజని (54వ వార్డు), ముర్రు వాణి (57వ వార్డు), పుర్రె పూర్ణశ్రీ (59వ వార్డు), కొణతాల సుధ (61వ వార్డు), బొడ్డు నరసింహపాత్రు డు (65వ వార్డు), రాజానా రామారావు (71వ వార్డు), తిప్పల వంశీరెడ్డి (74వ వార్డు), బట్టు సూర్యకుమారి (77వ వార్డు), కొణతాల నీలిమ (80వ వార్డు), పీలా లక్ష్మీ సౌజన్య(81వ వార్డు), ఇల్లపు వరలక్ష్మి (85వ వార్డు), కుంచె జ్యోత్స్న (91వ వార్డు), బెహరా వెంకట స్వర్ణలత శ్రీదేవి (92వ వార్డు), ముమ్మన దేముడు (95వ వార్డు).

షాక్!