జనసేనకు టీడీపీ జెల్ల | - | Sakshi
Sakshi News home page

జనసేనకు టీడీపీ జెల్ల

May 20 2025 1:28 AM | Updated on May 20 2025 1:28 AM

జనసేనకు టీడీపీ జెల్ల

జనసేనకు టీడీపీ జెల్ల

● పొత్తు ధర్మం విస్మరించి డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సమావేశానికి డుమ్మా కొట్టిన పలువురు టీడీపీ కార్పొరేటర్లు ● ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే కూడా గైర్హాజరు ● కోరంకు 56 మంది అవసరం కాగా 54 మంది హాజరు ● నేటికి ఎన్నిక వాయిదా వేస్తూ ఎన్నికల అధికారి ప్రకటన

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో జనసేనకు మిత్రపక్షమైన టీడీపీ జెల్ల కొట్టింది. పొత్తు ధర్మం మరిచి డిప్యూటీ మేయర్‌ కుర్చీ కోసం కుయుక్తులు పన్నింది. డిప్యూటీ మేయర్‌ పదవి జనసేనకు కేటాయించగా.. సోమవారం జరిగిన కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశానికి పలువురు టీడీపీ ఆశావహులు డుమ్మా కొట్టారు. దీంతో కోరం లేకపోవడంతో ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారి మయూర్‌ అశోక్‌ మంగళవారం నాటికి సమావేశం వాయిదా వేశారు. ముందస్తు సమాచారం మేరకు డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ప్రత్యేక సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభం కావాల్సి ఉంది. ఆ సమయానికి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఆ పార్టీ కార్పొరేటర్‌ కవితతోపాటు సీపీఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు, సీపీఐ కార్పొరేటర్‌ ఏజే స్టాలిన్‌ హాజరయ్యారు. 11.10 గంటలకు జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్‌, కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్‌బాబు కౌన్సిల్‌కు వచ్చారు. 11.15 గంటలకు జనసేనకు చెందిన 14 మంది కార్పొరేటర్లు సమావేశ మందిరానికి చేరుకున్నారు. 11.20 గంటలకు టీడీపీ ఎమ్మెల్యే గణబాబు వచ్చారు. 11.30 గంటలకు టీడీపీ కార్పొరేటర్లు(కాకి గోవిందరెడ్డి తప్ప) ఎవరూ హాజరు కాలేదు. మరో అరగంట మాత్రమే సమావేశం నిర్వహించేందుకు సమయం ఉంది. ఇంతలో ఒకరినొకరు చెవులు కొరుక్కునే పనిలో పడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాస్‌ 11.40 గంటలకు కౌన్సిల్‌ హాల్లోకి అడుగుపెట్టారు. అప్పటికే మేయర్‌ పీలా శ్రీనివాస్‌తో పాటు జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు మళ్లగుల్లాలు పడుతున్నారు.

11.53 గంటలకు ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారి రాక

ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారి మయూర్‌ అశోక్‌ 11.53 గంటలకు సమావేశానికి హాజరయ్యారు. (వాస్తవానికి సభ్యులకు ఇచ్చిన సమయానికే రావాలి). వచ్చిన వెంటనే ఎంత మంది సభ్యులు వచ్చారో లెక్కించాలని అధికారులను ఆదేశించారు. కోరం సరిపడా సభ్యులు లేకపోయినా ఇద్దరు అధికారులు (ఏడీసీ డి.వి.రమణమూర్తి, కార్యదర్శి బి.వెంకటరమణ) అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇంకా వస్తారా.. సార్‌ అంటూ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగారు. 12.10 గంటలైనా అధికారులిద్దరూ లెక్కపెడుతూనే ఉన్నారు. అప్పటికే సమయం మించిపోవడంతో ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారి మయూర్‌ అశోక్‌ నేరుగా సభ్యులను లెక్కించారు. ఎన్నికకు 56 మంది అవసరం కాగా 54 మందే హాజరయ్యారని.. కోరం తగ్గట్టు సభ్యులు లేరని గుర్తించారు. దీంతో సమావేశాన్ని మంగళవారం నాటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జనసేన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement