
ఎనిమిది నెలల చిన్నారికి గ్లకోమా శస్త్ర చికిత్స
సింహాచలం: ఎనిమిది నెలల గిరిజన శిశువుకు గ్లకోమా శస్త్ర చికిత్స విజయవంతం అయింది. విశాఖపట్నం నాయుడుతోటలోని శంకర్ ఫౌండేషన్ కంటి ఆస్పత్రి చూపు ప్రసాదించి అద్భుత మైలురాయిని అధిగమించిందని ఆస్పత్రి డీజీఎం కె.బంగార్రాజు శుక్రవారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే... అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలోని బట్టివలస గ్రామంలో ఈ ఏడాది మార్చి 28న శంకర్ ఫౌండేషన్ ఆస్పత్రి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించింది. ఆ గ్రామానికి చెందిన రంజిత్కుమార్ దంపతులు తమ ఎనిమిది నెలల చిన్నారికి నిరంతరం కుడి కంట్లో నీరు కారుతోందని వైద్య శిబిరానికి తీసుకొచ్చారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన డాక్టర్ సమృద్ధి దేశ్ముఖ్ ప్రత్యేక చికిత్స కోసం శంకర్ ఫౌండేషన్ ప్రధాన ఆస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో తల్లిదండ్రులు నాయుడుతోటలోని శంకర్ ఫౌండేషన్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. గ్లకోమా విభాగం డైరెక్టర్, హెచ్వోడీ డాక్టర్ టి.రవీంద్ర బృందం చిన్నారిని పరీక్షించింది. గ్లకోమాని నివారించడానికి, దృష్టి మరింత క్షీణించకుండా నిరోధించేందుకు శస్త్రచికిత్స చేయాలని నిర్ధారించారు. దాంతో మార్చి 29న శిశువుకు ట్రాబెక్యులోటోమీ శస్త్రచికిత్స చేశారు. శిశువుకు పూర్తిగా దృష్టిని పునరుద్ధరించారు. సంక్లిష్టమైన చికిత్సను విజయవంతంగా పూర్తిచేసి శిశువు జీవితంలో కొత్త కాంతిని తీసుకొచ్చిన డాక్టర్ రవీంద్ర అండ్ బృందాన్ని ఆస్పత్రి మేనేజింగ్ ట్రస్టీ ఎ.కృష్ణకుమార్, జీఎం కె.రాధాకృష్ణన్ అభినందించారు. సర్జరీ విజయవంతం కావడంతో వైద్య బృందానికి రంజిత్కుమార్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.