మానసిక దృఢత్వం ముఖ్యం
● అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ
ఆరిలోవ: పోలీసులు మానసిక దృఢత్వం కలిగి ఉండాలని అనకాపల్లి ఎస్పీ కె.వి.మురళీకృష్ణ అన్నారు. విశాలాక్షినగర్లోని ఏఆర్ పోలీస్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఇక్కడ మైదానంలో జరుగుతున్న పోలీస్ పరేడ్ను పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులతో మాట్లాడి రిజిస్టర్లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పునశ్చరణ తరగుతులు పోలీసుల్లో క్రమశిక్షణ కలిగిస్తాయన్నారు. బందోబస్తు సమయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆందోళన జరిగిన చోట పోలీసులు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఉన్నా.. తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అదనపు ఎస్పీ బి.విజయభాస్కర్, ఏఆర్ డీఎస్పీ పి.నాగేశ్వరరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్లు రామకృష్ణారావు, వెంకటరావు, సతీష్, అరవింద్ కిశోర్ పాల్గొన్నారు.