అక్రమ మైనింగ్‌పై | - | Sakshi
Sakshi News home page

అక్రమ మైనింగ్‌పై

Dec 13 2025 11:01 AM | Updated on Dec 13 2025 11:01 AM

అక్రమ మైనింగ్‌పై

అక్రమ మైనింగ్‌పై

ఉక్కుపాదం

సాక్షి, రంగారెడ్డిజిల్లా: అక్రమ మైనింగ్‌ తవ్వకాలపై ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే గుట్టుగా తవ్వకాలు జరిపి.. రాయల్టీ ఎగవేతకు పాల్పడిన అక్రమార్కుల నుంచి ముక్కుపిండి వసూలు చేయాలని రెవెన్యూ యంత్రాంగం నిర్ణ యించింది. ఈ మేరకు ఆయా మైనింగ్‌/ సెల్లార్‌ యజమానులపై రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్‌) యాక్ట్‌ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌, సరూర్‌నగర్‌, హయ త్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, గండిపేట, శంషాబాద్‌ మండలాల్లో మైనింగ్‌ మాఫియాకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఈ అంశంపై స్థానికుల నుంచి జిల్లా మైనింగ్‌ అధికారికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్‌ఐలు క్షేత్రస్థాయిలో పర్యటించి, అక్రమాలను గుర్తించడమే కాకుండా భారీ పెనా ల్టీలతో డిమాండ్‌ నోటీసులు జారీ చేశారు. అక్రమ తవ్వకాలు, రాయల్టీ చెల్లించకుండా గుట్టుగా మట్టిని తరలించే లారీలపై కేసులు నమోదు చేయాల్సిందిగా ఇటీవల ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, పహడీషరీఫ్‌ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేయకపోగా, పరోక్షంగా వారికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

డిమాండ్‌ నోటీసులతోనే సరి..

అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కోహెడ రెవెన్యూ సర్వే నంబర్‌ 167/2లో ఓ నిర్మాణ సంస్థ భారీగా తవ్వకాలు చేపట్టినా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గతంలో రూ.9.5 కోట్లకుపైగా ఫైన్‌ వేశారు. తట్టి అన్నారం సర్వే నంబర్‌ 121/పీలోనూ భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. తీసుకున్న అనుమతులకు మించి తవ్వకాలు చేపట్టినట్లు తేలింది. రూ.3.39 కోట్ల జరిమానా విధించారు. ఒక్క పైసా కూడా వసూలు చేయలేదు. సరూర్‌నగర్‌ మండలం మన్సూరాబాద్‌ సర్వే నంబర్‌ 38లో ఓ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ ఏడు ఎకరాల విస్తీర్ణంలో భారీ సెల్లార్‌ తవ్వుతోంది. తీసుకున్న అనుమతులకు మించి తవ్వకాలు చేపట్టినట్లు గుర్తించి రూ.రెండు కోట్లతో డిమాండ్‌ నోటీసు జారీ చేశారు. ఇప్పటి వరకు పైసా వసూలు చేయలేక పోయారు. గతంలో సెల్లార్‌ తవ్వుతుండగా, మట్టి కూలి నలుగురు కూలీలు మృతి చెందిన ప్రదేశంలోనూ యథావిధిగా తవ్వకాలు మొదలయ్యాయి. ఈ అక్రమ తవ్వకాల వెనుక కొంత మంది పెద్దల హస్తం ఉన్నట్లు తెలిసింది. శ్రీనగర్‌ రెవెన్యూ సర్వే నంబర్‌ 185,188, 189లోనూ ఓ మైనింగ్‌ ఏజెన్సీ అనుమతులకు భిన్నంగా తవ్వకాలు చేపట్టి భారీగా అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు ధృవీకరించారు. తవ్వకాలను ఆపాలంటూ రెవెన్యూ, పోలీసు, మున్సిపల్‌ అధికారులకు లేఖ రాసినా ఫలితం లేకపోయింది. తాజాగా మన్సూరాబాద్‌, హయత్‌నగర్‌ రెవెన్యూ పరిధిలోనూ అక్రమ సెల్లార్లను గుర్తించి, షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. సంగం హోటల్‌ ఎదురుగా కృపా కాలనీలోనూ సెల్లార్‌ తవ్వకాల ద్వారా వచ్చిన మట్టిని రాయల్టీ చెల్లించకుండా బయటికి అమ్ముతున్నట్లు గుర్తించి, నోటీసులు జారీ చేశారు. అడ్డగోలు తవ్వకాలు, మైనింగ్‌ అమ్మకాలపై ఎవరైనా స్థానికులు ఫిర్యాదు చేసినప్పుడు తనిఖీలకు వెళ్లడం, షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం మినహా పైసా కూడా వసూలు చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అంతు చిక్కడం లేదు.

సీరియస్‌గా తీసుకున్న రెవెన్యూ యంత్రాంగం

ముక్కుపిండి వసూలు చేయాలని నిర్ణయం

రెవెన్యూ రికవరీ యాక్ట్‌ అమలుకు సన్నాహాలు

ఆర్‌ఆర్‌ యాక్ట్‌తో ఆదాయం

నగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఓఆర్‌ఆర్‌కు అటు ఇటుగా గేటెడ్‌ కమ్యూనిటీలు, విల్లాలు, బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. గండిపేట్‌, మంచిరేవుల, కోకాపేట్‌, బుద్వేల్‌, నార్సింగి, ఎల్బీనగర్‌, మన్సూరాబాద్‌, శంషాబాద్‌, వనస్థలిపురం, తుర్కయంజాల్‌ కేంద్రంగా భారీగా బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. సెల్లార్‌ తవ్వకాలు జోరుగా సాగు తున్నాయి. ఈ తవ్వకాల ద్వారా వచ్చిన మట్టిని రాయల్టీ చెల్లించకుండా బహిరంగ మార్కెట్లో టిప్పర్‌కు రూ.5 వేల నుంచి రూ.6 వేల చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్కో గ్రానేట్‌ను సైజును బట్టి రూ.20 వరకు విక్రయిస్తున్నారు. ఇక నిర్మాణాల్లో ఉపయోగించే రోబోశాండ్‌ టన్నుకు రూ.600 నుంచి రూ.700 చొప్పున విక్రయిస్తున్నారు. నిర్మాణ ప్రదేశాల్లోనే క్రషర్లు ఏర్పాటు చేసి, ఎత్తయిన గుట్టలు, సెల్లార్‌ తవ్వకాల్లో భాగంగా వచ్చిన రాళ్లను క్రషర్లలో వేసి డస్ట్‌గా మారుస్తున్నారు. కనీస చర్యలు చేపట్టక పోవడంతో దుమ్ము, ధూళి సమీప కాలనీలను ముంచేస్తోంది. ప్రతి నెలా అడిగినంత ఇచ్చే వాళ్లకు రాచమర్యాదలు చేస్తూ.. నిరాకరించిన వాళ్ల టిప్పర్లపై కేసులు నమోదు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అంతు చిక్కడం లేదు. నిజానికి తెలంగాణ వ్యాప్తంగా మైనింగ్‌ తవ్వకాల ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.ఆరు వేల కోట్ల ఆదాయం వస్తే.. ఆర్‌ఆర్‌ యాక్ట్‌తో ఒక్క రంగారెడ్డి జిల్లా నుంచే మొండి బకాయిలు వసూలు చేయడం సహా రాయల్టీ ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.4,800 కోట్లు సమకూరే అవకాశం లేకపోలేదు. కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు రెవెన్యూ వాళ్లపై.. రెవెన్యూ వాళ్లు పోలీసులపై నెట్టేసి తప్పించుకుంటున్నారు. దీనిపై కలెక్టర్‌ సీరియస్‌గా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్‌ఆర్‌ యాక్ట్‌ను అమలుతో ఇప్పటి వరకు తిన్నదంత కక్కించొచ్చని భావిస్తున్నారు. ఆ మేరకు ఈ ఫెనాల్టీల వసూళ్ల కోసం దీన్ని పకడ్బందీగా అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement