300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
యాలాల: అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యంను సివిల్ సప్లయ్, ఎన్ఫోర్స్మెంట్, పోలీసు అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన మండల పరిధి బషీర్మియాతండా శివారులో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తండా సమీపంలో బాణాపూర్ గ్రామానికి చెందిన మహేశ్.. భారీగా బియ్యం నిల్వ ఉంచాడనే సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో యాసర్ అర్ఫాత్కు చెందిన స్టోన్ పాలిషింగ్ యూనిట్లో సుమారు 300 క్వింటాళ్లకు పైగా బియ్యాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసి, సివిల్ సప్లయ్ డీటీ గణపతి ఫిర్యాదు మేరకు.. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
ఆగి ఉన్న బైక్లో మంటలు
అనంతగిరి: ఆగి ఉన్న బైక్ నుంచి షార్ట్ సర్కూట్తో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటన సోమవారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో చోటు చేసుకుంది. మధ్యాహ్నం సమయంలో ఆపి ఉంచిన బైక్లో ఒక్కసారిగా పొగలు వచ్చి మంటలు రావడంతో చుట్టుపక్కల వారు భయపడ్డారు. వెంటనే నీరుపోసి మంటలను ఆర్పారు. దీంతో బైక్ పాక్షికంగా దెబ్బతింది.
రైలు ప్రమాదంలో
మహిళకు గాయాలు
తాండూరు టౌన్: రైలు పట్టాల పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఓ మహిళ ప్రమాదానికి గురైంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రారం గ్రామానికి చెందిన రజియా.. సోమవారం తాండూరు రైల్వే స్టేషన్ సమీపంలోని నారాయణపూర్ వద్ద రైలు పట్టాలకు అతి సమీపంగా నడుచుకుంటూ వెళ్తోంది. పక్కట్రాక్ పై వచ్చిన రైలు తాకిడికి ఆమె పక్కకు పడిపోయింది. దీంతో ఆమె కాళ్లు, చేతులు విరిగాయి. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది.. చికిత్స నిమిత్తం క్షతగాత్రురాలిని తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి
మృతదేహం లభ్యం
అనంతగిరి: రైల్వే పట్టాల పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రైల్వేస్టేషన్ మేనేజర్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. మృతుడి వయసు 40– 45 ఏళ్లు ఉంటుదని తెలిపారు. మృతదేహంపై గోధుమరంగు ఫుల్ చొక్కా ఉండి ముదురు నీలం రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు వికారాబాద్ రైల్వే పీఎస్లో సంప్రదించాలన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు సోమవారం తెలిపారు.
ఆలయ ట్రస్టు బోర్డుకు దరఖాస్తుల ఆహ్వానం
పూడూరు: రాకంచర్ల యోగానందా లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ట్రస్టు బోర్డు నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేశామని జిల్లా ఈఓ నరేందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నోటీస్ ఇచ్చిన తేదీ నుంచి 20 రోజుల లోపు.. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అప్పటి నుంచి ఏడాది పాటు ఆలయ ధర్మకర్తలుగా ఉంటారని పేర్కొన్నారు. ఆలయ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
యువతి ఆత్మహత్య
మంచాల: యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధి ఆరుట్ల గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పంబాల నందిని(21).. ఇంటర్ చదివి, ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సోమవారం విధులకు వెళ్లలేదు. తండ్రి దండ్రులు పనికి వెళ్లగా.. ఇంట్లో చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సాయంత్రం పని ముగించుకొని తండ్రి ఇంటికి వచ్చి చూడగా.. కూతురు విగత జీవిగా వేళాడుతూ కనిపించింది. ఆమె ఆత్మ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత


