
గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
తాండూరు టౌన్: తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.వసంత కుమారి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంగ్లిష్, తెలుగు, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, వాణిజ్య శాస్త్రం (ఆంగ్లం, ఉర్దూ మీడియం) సబ్జెక్టుల్లో రెండేసి ఖాళీలు, గణిత, రాజనీతి శాస్త్రం, హిందీ, ఉర్దూ, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రంలో ఒక్కో పోస్టు చొప్పున ఖాళీలు ఉన్నాయని చెప్పారు. సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం మార్కులతో పీజీ పూర్తి చేసి ఉండాలని పేర్కొన్నారు. పీహెచ్డీ, నెట్, సెట్ ఉత్తీర్ణులైన వారికి, బోధన అనుభవం ఉన్న వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న అర్హులు ఈ నెల 23న సాయంత్రం 4గంటల వరకు కళాశాలలో నేరుగా దరఖాస్తులు అందజేయాలని ప్రిన్సిపాల్ తెలిపారు.
వికారాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో..
అనంతగిరి: వికారాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి గాను అతిథి అధ్యాపకులుగా పనిచేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పీవీ గీతాలక్ష్మి పట్నాయక్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాలలో కంప్యూటర్ సైన్స్–1, ఫిజిక్స్–1, మ్యాథ్స్–1, ఇంగ్లిష్–1, కామర్స్–2, పొలిటికల్ సైన్స్–1 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 23వ తేదీ వరకు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు. 24న డెమో క్లాసులు, ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన తాండూర్ డిగ్రీ కళాశాలలో ఉంటుందన్నారు.
స్థానిక ఎన్నికల్లో
సత్తా చాటండి
మాజీ మంత్రి హరీశ్రావు
దౌల్తాబాద్: మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్రావును ఆదివారం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు కలిశారు. నగరంలోని ఆయన నివాసంలో కలిసిన నాయకులు మండలంలోని రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కోట్ల మహిపాల్ తెలిపారు. హరీశ్రావును కలిసిన వారిలో నాయకులు నర్సింలు, అంజి తదితరులున్నారు.
మొక్కలతోనే
మానవ మనుగడ
సబ్జైల్ సూపరింటెండెంట్ రాజ్కుమార్
పరిగి: నేడు నాటిన మొక్క రేపటి తరానికి మేలు చేస్తుందని పరిగి సబ్జైల్ సూపరింటెండెంట్ రాజ్కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవంలో భాగంగా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పరిగి పరిసర ప్రాంతాల్లో 200 సీడ్బాల్స్ చల్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీడ్ బాల్స్ చల్లడంతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో మొక్కలను నాటే వీలుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జైళ్ల శాఖ ఇప్పటి వరకు 2 లక్షల సీడ్బాల్స్ తయారు చేసి చల్లామన్నారు. జైళ్ల శాఖ పెట్రోల్ బంక్లలో సీడ్బాల్స్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ప్రతీ ఒక్కరు సీడ్బాల్స్ చల్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జైలు సిబ్బంది యాదగిరి, శ్రీను, కృష్ణ, అక్షయ్, నరేశ్ పాల్గొన్నారు.
మైసమ్మ సన్నిధిలో అచ్చంపేట ఎమ్మెల్యే
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవతను ఆదివారం ఉదయం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు తీర్థ ప్రసాదం అందజేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ నరేశ్నాయక్, సింగిల్విండో డైరెక్టర్ వెంకటేశ్, నాయకులు జవహర్లాల్, హీరాసింగ్, తులసీ రాంనాయక్, మహేందర్గౌడ్ ఉన్నారు.