
ఇంటికి వెలుగు ఇల్లాలే
అనంతగిరి: పేదలకు మంచి చేయాలంటే పదవులే కాదు మంచి మనసు కూడా ఉండాలని.. మీరందరూ ఈ విషయాన్ని గమనించాలని స్పీకర్ ప్రసాద్కుమార్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి సంబురాలతోపాటు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ(రూ.9.12 కోట్లు) చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే కుటుంబాలతో పాటు దేశం కూడా పురోగతి సాధిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ప్రతి ఇంటికీ ఇల్లాలే వెలుగని పేర్కొన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లను కూడా వారి పేరిట ఇస్తున్నట్లు గుర్తు చేశారు. మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్లు, ఆర్టీసీకి అద్దె బస్సులు ఇప్పించడం, పెట్రోల్ బంకుల నిర్వాహణ, ధాన్యం కొనుగోలు, రైస్ మిల్లుల ఏర్పాటు చేయిస్తున్నట్లు వివరించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో ఏటా రూ.20 వేల కోట్లు వడ్డీ లేకుండా ఇస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలు డ్రోన్ల వ్యాపారం చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. సీ్త్రలు వ్యాపార వేత్తలుగా ఎదిగి తోటి వారకి ఉపాధి కల్పించాలని సూచించారు. మహిళల ఆశీర్వాదం ఉంటే ప్రభుత్వం చల్లగా ఉంటుందన్నారు. మహిళా సంఘాల్లోని సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు, సాధారణంగా మరణిస్తే రూ.2 లక్షల బీమా అమలవుతుందని పేర్కొన్నారు.జిల్లాలో రూ.32.70 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు చేసినట్లు చెప్పారు. తద్వారా వికారాబాద్ నియోజకవర్గంలోని 30 వేల మందికి లబ్ధి చేకూరినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, హెల్ప్ డైరెక్టర్ జాన్సన్, డీఆర్డీఓ శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్టీవో సభ్యుడు జాఫర్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సుదర్శన్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు జానకి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అనంతగిరి గుట్టపై అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న పార్క్ అభివృద్ధి పనులకు గురువారం స్పీకర్ ప్రసాద్కుమార్ శంకుస్థాపన చేశారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనంతగిరులను అన్ని విధాల అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్లో ప్రాంగణం పునర్నిర్మాణం, బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్, కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమేష్, డీఆర్డీఓ శ్రీనివాస్, డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్, ఆర్డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు.
స్పీకర్ ప్రసాద్కుమార్
కలెక్టరేట్లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ