తేలేదెప్పుడో..? | - | Sakshi
Sakshi News home page

తేలేదెప్పుడో..?

Jun 30 2025 7:30 AM | Updated on Jun 30 2025 7:52 AM

● కొలిక్కిరాని ఎనికేపల్లి భూముల వ్యవహారం

● ఎన్నిసార్లు చర్చలు జరిగినా తేలని పరిహారం

● రెండుసార్లు సర్వే చేయకుండానే వెనుదిరిగిన అధికారులు

● కొనసాగుతున్న పోలీస్‌ పహారా

మొయినాబాద్‌: ఎనికేపల్లి భూముల వ్యవహారం ఎటూ తేలడంలేదు. పరిహారం విషయంలో అటు అధికారులు, ఇటు రైతులు పట్టు వీడడంలేదు. ఇప్పటికే పలు దఫాలుగా అధికారులు రైతులతో చర్చలు జరిపారు. పరిహారం విషయంలో ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో నెల రోజులుగా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు.

రెవెన్యూ రికార్డుల్లో సర్కారు భూమి

ఎనికేపల్లి సర్వేనంబర్‌ 180లోని 99.14 ఎకరాలు 1954 నుంచి రెవెన్యూ రికార్డుల్లో సర్కారి భూమిగానే నమోదవుతూ వస్తోంది. 1954లో ఈ భూమిని హరిజనులు సాగుచేసుకోవడానికి ఇచ్చినట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. కొన్నేళ్ల పాటు రైతుల పేరు కబ్జా కాలంలో వచ్చాయి తప్ప అసైనీలుగా పేర్కొనలేదు. రెవెన్యూ రికార్డుల్లో పూర్తిగా సర్కారు భూమిగా కొనసాగుతూ వచ్చింది. గ్రామానికి చెందిన సుమారు 50 మంది రైతులు డైబ్బె ఏళ్లుగా ఇక్కడ సాగుచేసుకుంటున్నారు. ఈ భూములను ప్రభుత్వం ఇటీవల గోశాల ఏర్పాటుకు కేటాయించింది. విషయం తెలిసిన గ్రామస్తులు నెల రోజుల నుంచి ఆందోళన మొదలు పెట్టారు. ఈ భూములనే నమ్ముకుని జీవిస్తున్నామని, తమకే అసైన్డ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పలు రాజకీయ పార్టీల నేతలు సైతం భూములను పరిశీలించి రైతులకు మద్దతుగా ఉంటామని ప్రకటించారు.

చర్చలు విఫలం

భూములు సాగుచేసుకుంటున్న రైతులతో రెవెన్యూ అధికారులు పలుమార్లు చర్చలు జరిపారు. చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, మొయినాబాద్‌ తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌ పరిహారం విషయంపై వారితో చర్చించారు. ఎకరాకు వెయ్యి గజాల చొప్పున పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరాకు 200 గజాల చొప్పున ఇస్తామని అధికారులు తేల్చి చెప్పారు. మూడుసార్లు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి.

ఎమ్మెల్యేపై భారం వేసిన రైతులు

పరిహారం విషయంలో రైతులు ఎమ్మెల్యే కాలె యాదయ్యపై భారం వేశారు. పలుమార్లు ఆయనను కలిసి ప్రభుత్వంతో చర్చించి మంచి పరిహారం ఇప్పించాలని కోరారు. రైతులను తీసు కుని కలెక్టర్‌ నారాయణరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే పరిహారం విషయంపై చర్చించారు. ఎకరాకు 800 గజాలు పరిహారంగా ఇవ్వాలని ఎమ్మెల్యే కోరగా 250 గజాలు ఇస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కనీసం ఎకరాాకు 400 గజాలైనా ఇవ్వాలని ఎమ్మె ల్యే కోరారు. ఈ విషయమై శనివారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి చర్చించారు. ఎకరాకు 350 గజాల స్థలం ఇచ్చేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ పరిహారంపై కొందరు రైతులు సంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం.

రెండు సార్లు సర్వే చేయకుండానే..

గోశాలకు కేటాయించిన భూములను సర్వే చేసేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు రెండుసార్లు వచ్చారు. పరిహారం విషయం తేలకపోవడంతో సర్వే చేయకుండానే వెనుదిరిగారు. మరోవైపు ఎనికేపల్లి భూముల వద్ద పోలీస్‌ పహారా కొనసాగుతోంది. కొత్త వ్యక్తులు, రైతులను అటువైపు రాకుండా కాపలా కాస్తున్నారు.

ఎనికేపల్లిలో గోశాలకు కేటాయించిన భూమి

మా బతుకులు ఏం కావాలి

తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్నాం. ప్రభుత్వం ఇప్పుడు గోశాలకు ఇస్తే మా బతుకులు ఏం కావాలి. 1954 నుంచి 1998 వరకు పహణీల్లో మా పేర్లు వచ్చాయి. తరువాత సర్కారు భూమి అని వచ్చింది. మోకిలలో ఇచ్చినట్లు ఎకరాకు 750 గజాల చొప్పున పరిహారం ఇస్తే మంచిది.

– న్యాలట మహిపాల్‌, రైతు, ఎనికేపల్లి

ప్రభుత్వమే ఆదుకోవాలి

సాగుచేసుకుంటున్న భూములు తీసుకుంటే మా బతుకులు ఆగమైతయి. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. ఎంత పరిహారం ఇస్తామన్న విషయం అధికారులు సరిగా చెప్పడంలేదు. ఎమ్మెల్యేపైనే భారం పెట్టాం. ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడి పరిహారం ఇప్పిస్తామని చెప్పారు.

– అనుసూయ, మహిళా రైతు, ఎనికేపల్లి

తేలేదెప్పుడో..?1
1/2

తేలేదెప్పుడో..?

తేలేదెప్పుడో..?2
2/2

తేలేదెప్పుడో..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement