
రహదారి.. ప్రతిపాదనలతోనే సరి
వికారాబాద్: గతంలో కురిసిన వర్షాలకు పాడైన రోడ్లు చిన్నపాటి వర్షం కురిసినా చిత్తడిగా మారుతున్నాయి. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, మున్సిపల్ అనే తేడా లేకుండా రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. అధికారులను ప్రశ్నిస్తే ప్రతిపాదనలు పంపామంటూ చేతులు దులుపుకొంటున్నారు తప్ప కనీస మరమ్మతులు కూడా చేపట్టడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. వర్షాలు కురిసిన ప్రతీసారి దెబ్బతిన్న రోడ్ల వివరాలు సేకరించామంటున్నారే తప్పితే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
టెండర్లకే పరిమితమైన మరమ్మతులు
జిల్లాలో గతేడాది కురిసిన వర్షాలకు పాడైన ఆర్అండ్బీ రోడ్లకు సంబంధించి ఆ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపారు. అధికారుల సర్వేలో జిల్లా వ్యాప్తంగా 198 కిలోమీటర్ల మేర రోడ్లు పాడైనట్లు తేలింది. వీటిని పూర్తి స్థాయిలో పర్మినెంట్గా బాగు చేసేందుకు రూ.89 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.8కోట్ల నిధులు అవసరమవుతాయని ప్రతిపాదనల్లో ప్రస్తావించారు. ఇందులో ఆర్అండ్బీ శాఖ 98 కిలోమీర్ల మేర రోడ్ల మరమ్మతులకు రూ.39 కోట్లు, పంచాయతీ రాజ్ నుంచి రూ. 20 కోట్లు మంజూరయ్యాయి. అయితే ఈ రెండు శాఖల్లోనూ పాడైన రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు, రోడ్లు మంజూరు, టెండర్ల ప్రక్రియ దగ్గరే నిలిచిపోయింది.
మెజార్టీ రోడ్లన్నీ అంతే
జిల్లాలో ఒకటి రెండు రోడ్లు మినహా మెజారిటీ రోడ్లు అధ్వానంగా మారాయి. వికారాబాద్–పరిగి, వికారాబాద్–నవాబుపేట, వికారాబాద్–బుగ్గదేవాలయం వేళ్లే దారి, వికారాబాద్–తాండూరు రహదారి, కొడంగల్–తాండూరు, కొడంగల్–మహబూబ్నగర్, పరిగి–మిట్టకోడూర్, దోమ మండల పరిధిలోని దోర్నాల్పల్లి–గొడుగోనిపల్లి , ఐనాపూర్–పాలెపల్లి, గడిసింగాపూర్–మల్లెపల్లి, వికారాబాద్–సదాశివాపేట్, కోటాలగూడ–లాల్సింగ్తండా, మన్నెగూడ–మిర్జాపూర్ మీదుగా లాల్సింగ్ తండా, వికారాబాద్–దామగుండ తదితర రోడ్లన్నీ ప్రయాణానికి ఇబ్బందిగా మారాయి.
పరిగి మున్సిపల్లో కొడంగల్ చౌరస్తా నుంచి వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే రోడ్డు దుస్థితి
అధ్వానంగా అంతర్గత రోడ్లు
చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారుతున్న వైనం
వాహనదారులకు నరకయాతన
పట్టించుకోని ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ శాఖలు
కొత్తరోడ్లు మంజూరయ్యాయంటూ దాటవేస్తున్న అధికారులు