
ఆర్టీసీ టూర్ ప్యాకేజీకి విశేష స్పందన
అనంతగిరి: ఆలయాల సందర్శనకు ఆర్టీసీ ప్రవేశపెట్టిన టూర్ ప్యాకేజీకి విశేష స్పందన లభిస్తుందని వికారాబాద్ డీఎం అరుణ అన్నారు. ఈ ప్యాకేజీలో 64 మంది ప్రయాణికులు ఈ నెల 27న ధర్మపురి ఆలయాల సందర్శనకు బయలుదేరారని చెప్పారు. వికారాబాద్, హైదరాబాద్, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాల దర్శనానికి ప్రత్యేక ప్యాకేజీలతో రెండు బస్సులు నడిపినట్లు ఆమె తెలిపారు. అరుణాచలం, మంత్రాలయం, భద్రాచలం, పంచారామాలు వివిధ ప్రత్యేక ప్యాకేజీలతో బస్సులు నడుతున్నామని పరిసర ప్రాంత ప్రజలందతా సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కనీసం 30–40 మంది ప్రయాణికులు ముందుకు వస్తే నేరుగా వారి కాలనీ వద్దకే బస్సు పంపుతామని చెప్పారు. వివరాలకు 99592 26252 నంబర్లో సంప్రదించాలన్నారు.
రేణుక ఎల్లమ్మ ఆలయంలో మృత్యుంజయ హోమం
నేడు కర్ణాటక మాజీ మంత్రి లింబావళి రాక
తాండూరు రూరల్: మండల పరిధిలోని కొత్లాపూర్ శివారులోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. మూడు రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు హోమాలు నిర్వహించనున్నారు. సోమవారం కర్ణాటక మాజీ మంత్రి అరవింద్ లింబావళి తమ ఇంటి దేవత కొత్లాపూర్ రేణుక ఎల్లమ్మ ఆలయానికి విచ్చేయనున్నారు. ఆలయానికి దోషం ఉందని చెప్పడంతో కేరళ నుంచి తొమ్మిది మంది పూజారులతో మృత్యుంజయ హోమం నిర్వహించనున్నారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ నవీన్ రెడ్డి, డైరక్టర్లు రాజు, లాలయ్యగౌడ్, శాంతప్ప, లాల్య నాయక్, ఈశ్వరమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
విద్య, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి
పరిగి: విద్య, ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడుతామని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని తపస్ కార్యాలయంలో జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ప్రతీ ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా తమదృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రతీ పాఠశాలలో తాగునీటి వసతి కల్పిస్తామన్నారు. ఉపాధ్యాయుల నుంచి వస్తున్న మల్టీ జోన్–2లో ఖాళీగా ఉన్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీఆర్ఎం దక్షిణ మధ్య క్షేత్రప్రముఖ్ విష్ణువర్థన్రెడ్డి, మండల విద్యాధికారి గోపాల్, రమేశ్యాదవ్, లక్ష్మయ్య, సాయిబాబ తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ
పరిగి: కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లు రద్దు చేసేందుకు యత్నిస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలనే డిమాండ్తో జూలై 9వ తేదీన నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం పట్టణ కేంద్రంలో సమ్మెకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మికులపై కక్షసాధింపులకు పాల్పడుతోందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ దేశ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.

ఆర్టీసీ టూర్ ప్యాకేజీకి విశేష స్పందన