
విద్యార్థుల సంఖ్య పెరగాలి
అనంతగిరి: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీలు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా కృషి చేయాలని ఆదేశించారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్ నుంచి అన్ని శాఖల జిల్లా అధికారులు, మ్చండల స్థాయి అధికారులు, పాఠశాలల హెచ్ఎంలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించాలన్నారు. గ్రామాల్లోని బాలబాలికలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బడిబయట పిల్లలు ఉండరాదన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాలన్నారు. సర్కారు బడుల్లోని వసతులు, నాణ్యమైన బోధనను ప్రజలకు వివరించాలని తెలిపారు. పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పాఠశాలలకు చేర్చామని పేర్కొన్నారు.
ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచండి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. రెండో విడతలో ఇళ్లు మంజూరైన వారు పనులు చేపట్టేలా అధికారులు చొరవ చూపాలన్నారు. అర్హులకు పెన్షన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, డీఆర్డీఓ శ్రీనివాస్, డీఈఓ రేణుకాదేవి, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏపీఎంలు, మున్సిపల్ కమిషనర్లు, ప్రిన్సిపళ్లు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
బొంరాస్పేట: భూ భారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మండలంలోని రేగడిమైలారంలో బుధవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 20 వరకు సదస్సులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 14వ తేదీలోపు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అనంతరం నాగిరెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. బొంరాస్పేట రేషన్ దుకాణంలో బియ్యం పంపిణీపై ఆరా తీశారు. తదనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, డీఎస్వో మోహన్బాబు, తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీవో వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్
రేపటి నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం