
తునికాకు కూలీలకు తిప్పలు
ధారూరు: పేదలకు తునికాకు సేకరణ ప్రధాన ఆదాయ వనరు. నలభై రోజులు అడవిలో తునికాకు సేకరించి కళ్లాల్లో విక్రయించిన కూలీలకు డబ్బులు చెల్లించకపోవడంతో శుక్రవారం వారు నిర్వాహకుల ఇళ్లను ముట్టడించారు. దీంతో సదరు నిర్వాహకులు ఫారెస్ట్ అధికారుల వద్దకు పరుగులు తీశారు. మండల పరిధిలోని పలుగ్రామాల కూలీలు ఏప్రిల్ 21 నుంచి మే 30 వరకు 3,04,600 తునికాకు కట్టలు సేకరించి నిర్వాహకులు ఏర్పాటు చేసిన కళ్లాల్లో విక్రయించారు. ఇందుకు సంబంధించి ఒక్కో కట్టకు రూ.3.30 చెల్లించాల్సి ఉంటుంది. నాటి నుంచి కాంట్రాక్టర్ చెల్లిస్తాడని నిర్వాహకులు, ఫారెస్ట్ అధికారులు చెల్లిస్తారని కాంట్రాక్టర్ బదులిస్తూ వచ్చారు. ఇందుకు సంబంధించి రూ.10.05లక్షలు పెండింగ్లో ఉన్నాయి. ఇందుకు సంబంధించి కూలీల బ్యాంకు ఖాతాలు తీసుకుని వివరాలు ఆన్లైన్ చేశామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. తమకు పోషణ భారమైందని అధికారులు త్వరితగతిన తమ డబ్బులు జమ చేయాలని కూలీలు కోరుతున్నారు.
కూలి డబ్బుల చెల్లింపులో జాప్యం
నిర్వాహకుల ఇళ్లను ముట్టడించిన కూలీలు