దుద్యాల్: ముందస్తు నైరుతి రుతుపవనాలతో మండలంలో వానలు దంచికొడుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి పంటకు నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం వరి పంట కోతకు వచ్చింది. ఇప్పటికే చాలా మంది రైతులు కోతలు పూర్తి చేసి దిగుబడిని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. అక్కడ తూకం వేయడంలో జాప్యం జరుగుతుండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాల కారణంగా మరికొంత మంది కోతలు ఆపేశారు. వానలు తగ్గితే తప్ప కోతలు సాధ్యం కాదని అంటున్నారు. దీంతో పొలాల్లో అలాగే వదిలేశారు. లక్షల పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చే సమయంలో వరుణుడు ప్రతాపం చూపుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు
దుద్యాల్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. లారీలు సకాలంలో రాకపోవడంతో వడ్ల బస్తాలను మిల్లులకు తరలించడం లేదు. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచారు. పంట దిగుబడిని కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ధాన్యం బస్తాలను త్వరగా మిల్లులకు తరలించాలని వారు కోరుతున్నారు.
ఇళ్ల మధ్య వర్షపు నీరు
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని హస్నాబాద్ ఎస్సీ వాడ జలమయంగా మారింది. ఇళ్ల మధ్య భారీగా నీరు చేరింది. నడిచేందుకు కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. కాలనీ సమీపంలో రోడ్డు పనులు జరుగుతున్నాయి. కల్వర్టు నిర్మాణ పనులు నత్తనడకగా సాగుతుండటంతో వర్షపు నీరు ముందుకు వెళ్లడం లేదని స్థానికులు తెలిపారు.
దంచికొడుతున్న వానలు
కోతకు వచ్చినా పొలాల్లోనే వరి పంట
కొనుగోలు కేంద్రాల్లో తడుస్తున్న ధాన్యం బస్తాలు
అన్ని విధాలా నష్టపోతున్న రైతన్న
ఆదుకోవాలని విన్నపం
మట్టి వేయడంతోనే..
కాలనీ సమీపంలో రోడ్డు పను లు జరుగుతున్నాయి. కాలనీ నుంచి వర్షపు నీరు దిగువకు పో కుండా కాలువకు అడ్డంగా మ ట్టి పోశారు. దీంతో ఇళ్ల మధ్య నీరు నిలిచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. మరి కొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున వెంటనే చర్యలు చేపట్టాలి. లేకుంటే ఇళ్లల్లోకి వరద నీరు చేరే అవకాశం ఉంది.
– దశరథ్, ఎస్సీ కాలనీ వాసి, హస్నాబాద్
అన్నదాతకు వరుణ గండం