
సీఎం ఇలాకాలో తాగునీటి ఎద్దడి
కొడంగల్: నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. మిషన్ భగీరథ పథకంలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమైనా మిషన్ భగీరథ అధికారుల్లో చలనం లేదు. రెండేళ్లుగా మంచినీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఒక్కోసారి రెండు మూడు రోజులు నీటి సరఫరా ఉండదు. సరఫరా చేసే రోజుల్లో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని స్థానికులు తెలిపారు. నల్లాల్లో నామమాత్రంగా నీరు వస్తోందని మహిళలు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు నీరు వస్తుందో.. ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతమెంతో ఘనం
గతంలో మిషన్ భగీరథకు మంచి పేరు ఉండేది. రెండేళ్లుగా పథకం పని తీరులో మార్పు వచ్చింది. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో నీటి కష్టాలు మొదలయ్యాయి. గతంలో మిషన్ భగీరథ ద్వారా నియోజకవర్గంలోని ఇంటింటికీ మంచినీటి సరఫరా జరిగేది. చాలా గ్రామాల్లో దాహర్తి తీరింది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి వచ్చే నీటి సామర్థ్యం తగ్గింది. దీంతో కొడంగల్కు నీటిని సరఫరా చేసే స్థితిలో లేదు. పథకం ప్రారంభించిన కొత్తలో ఉదయం 6నుంచి 8 గంటల వరకు నీరు వదిలేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉదయం ఆరున్నర నుంచి గంట కూడా సరిగ్గా రావడం లేదని మహిళలు వాపోతున్నారు. కొన్ని కాలనీల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని తెలిపారు. పాత కొడంగల్, పాత కొడంగల్ తండా, గుండ్లకుంట, కొండారెడ్డిపల్లి, బూల్కాపూర్ గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది.
సుదూరం నుంచి..
శ్రీశైలం నుంచి కొడంగల్కు నీటి సరఫరా జరుగుతుందంటే మొదట్లో ఎవరూ నమ్మలేదు. 283 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణానది నుంచి మిషన్ భగీరథ పథకంలో కొడంగల్కు వచ్చిన నీటిని చూసి జనం ఆశ్చర్యపోయారు. శ్రీశైలం నుంచి పాతాళగంగ కొడంగల్కు వస్తుంటే జనం పులకరించి పోయారు. పట్టణ శివారులోని సిద్దనొంపు సమీపంలో ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (డబ్లుటీపీ) నుంచి గ్రామాల్లో ఉన్న ఓవర్హెడ్ ట్యాంకులకు నీటిని పంపింగ్ చేసి కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ మేలు చేసిందని జనం మెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఏమి జరిగిందో కానీ పూర్తి స్థాయిలో నీటి సరఫరా కావడం లేదనే అపవాదును మూటగట్టుకుంది. ఈ విషయంపై మిషన్ భగీరథ అధికారులను వివరణ కోరగా శ్రీశైలం నుంచి నీరు రావడం లేదని అంటున్నారు. ఒక్కోసారి సాంకేతిక సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. పూర్తి స్థాయిలో నీరు రాకపోవడం వల్ల సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు.
మిషన్ భగీరథలో సాంకేతిక సమస్యలే కారణం
పట్టించుకోని అధికార యంత్రాంగం