
కోటా
రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీకి కసరత్తు
ఒకేసారి
మూడు నెలల
వికారాబాద్: ఒకేసారి మూడు నెలల(జూన్, జూలై, ఆగస్టు)కు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ ఒకటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే మన రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను అధిగమించి మూడు నెలల కోటా ఒకేసారి ఇచ్చేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయమై కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) లింగ్యానాయక్ పౌరసరఫరాల శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం క్షేత్రస్థాయి అధికారులు, డీలర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు. పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. సాధారణంగా నెలలో 15 రోజులు మాత్రమే బియ్యం పంపిణీ చేసేవారు.. ప్రస్తుతం ఒకేసారి మూడు నెలల కోటా ఇస్తున్నందున గడువుతో సంబంధం లేకుండా లబ్ధిదారులు తీసుకెళ్లే వరకు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
సమస్యలను అధిగమిస్తేనే..
ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యం ఒకే నెలలో పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో పలు సమస్యలు ఎదురుకానున్నాయి. గతంలో కోవిడ్ సమయంలో మాత్రమే ఒకేసారి రెండు నెలల కోటా ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో ఒకటి లేదా రెండు నెలల కోటాను పంపిణీ చేసేందుకు మెకానిజం ఉండగా మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేయాలంటే మాత్రమే పలు సమస్యలను అధిగమించాల్సి ఉంది. కోటా నిల్వకు సరిపడా గోదాములను సమకూర్చుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో గ్రామాల్లో డీలర్ల దగ్గర కూడా మూడు నెలల కోటా ఒకే సారి నిల్వ చేయటానికి సరపడా స్థలాలు లేకపోవటం కూడా సమస్య కానుంది. అయితే ఇతర జిల్లాల నుంచి వచ్చిన బియ్యం వచ్చినట్టు గ్రామాలకు చేరవేయటం ద్వారా గోదాముల కొరతను అధిగమించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటిలాగే నెలలో 15రోజులు కాకుండా నెల మొత్తం బియ్యం పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో 2,48,745 రేషన్ కార్డులు
జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 1.30లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా యాసంగిలో 90వేల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం పంపిణీ చేసే సమయంలో జిల్లాలో పండిన వడ్ల ద్వారా సీఎంఆర్ రూపంలో సేకరించినవి సరిపోయేవి. ప్రస్తుతం సన్నబియ్యం ఇస్తున్నందున జిల్లాలో వచ్చే దిగుబడి సరిపోవడంలేదు. కొనుగోలు కేంద్రాలకు ఐదు శాతానికి మించి సన్నరకం వడ్లు రావడం లేదు. ఇవి కేవలం మూడు నెలలకు మాత్రమే సరిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకే సారి మొత్తం బియ్యం ఇచ్చేస్తే ఆ తర్వాత పంపిణీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 2,48,475 రేషన్ కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతి నెలా 5,782 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒకేసారి మూడు నెలల కోటా బియ్యం అంటే 17వేల మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులు పండించిన సన్నరకం వడ్లను ఎక్కువ శాతం బహిరంగ మార్కెట్లోనే విక్రయిస్తున్నారు. దీంతో సన్నబియ్యం కోసం పక్క జిల్లాలపై ఆధారపడక తప్పడంలేదు. ప్రస్తుతం మూడు నెలల కోటాకు సంబంధించి మన పక్క జిల్లాలు అయిన నారాయణపేట, సంగారెడ్డి, నిజామాబాద్, వనపర్తి నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
జూన్ ఒకటి నుంచి 30వరకు సరఫరా ఐదు జిల్లాల నుంచి బియ్యం దిగుమతి ప్రతి నెలా ఇచ్చేది 5,782 మెట్రిక్ టన్నులు మూడు నెలల కోటాకు 17 వేల మెట్రిక్ టన్నులు అవసరం స్టాక్ నిల్వకు గోదాముల కొరత
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకేసారి మూడు నెలల రేష న్ బియ్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. లబ్ధిదారులకు మూడు నెలల కోటా బియ్యం అందజేస్తాం. ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశాం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.
– లింగ్యానాయక్, అడిషనల్ కలెక్టర్

కోటా