
బ్రిడ్జి పనులను సత్వరం పూర్తి చేయండి
పంచాయతీ రాజ్ ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి
తాండూరు రూరల్: కాగ్నానదిపై చేపట్టిన హైలెవల్ బ్రిడ్జి పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి కాంట్రాక్టర్ను ఆదేశించారు. మంగళవారం మండలంలోని బొంకూర్ – బిజ్వార్ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రూ.4.85 కోట్లతో బ్రిడ్జి పనులు జరుగుతున్నాయని వివరించారు. వేసవికాలం ముగిసేలోపు పనుల్లో పురోగతి సాధించాలన్నారు. బొంకూర్ – రుక్మాపూర్ గ్రామాల మధ్య బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.56కోట్లు మంజూరయ్యాయని వెంటనే పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రూ.1.75 కోట్లతో చేపట్టిన అల్లాపూర్ – సిరిగిరిపేట్ రోడ్డు పనులను, రూ.1.25 కోట్లతో చేపట్టిన సిరిగిరిపేట్ – సంకిరెడ్డిపల్లి రోడ్డు పనులను సత్వరం పూర్తి చేయాలన్నారు. అనంతరం తాండూరులోని పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయంలో పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ తాండూరు డివిజన్ ఈఈ సత్యనారాయణరెడ్డి, డీఈ నాగభూషణం, ఏఈ నందిని తదితరులు పాల్గొన్నారు.
వేసవి శిబిరాలను
సద్వినియోగం చేసుకోవాలి
డీఈఓ రేణుకాదేవి
మోమిన్పేట: మండలంలోని ఎన్కతల ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిబిరాన్ని మంగళవారం జిల్లా విద్యాధికారి రేణుకాదేవి సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమం గురించి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వేసవి శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న శిక్షణ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ మల్లేశం, ప్రధానోపాధ్యాయుడు గౌరీశంకర్, రమేష్, పద్మ, శ్రీనివాస్రెడ్డి, రజిని, రాజు, పాఠశాల చైర్పర్సన్ కళావతి తదితరులు పాల్గొన్నారు.
భూ భారతికి
24 దరఖాస్తులు
పరిశీలించిన ఆర్డీఓ వాసుచంద్ర
ధారూరు: మండలంలోని అంపల్లి, క్యాచారం గ్రామాల్లో మంగళవారం భూ భారతి అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ రెండు గ్రామాల నుంచి భూ సమస్యల పరిష్కారం కోసం 24 దరఖాస్తులు వచ్చాయి. కాచారం గ్రామంలో నిర్వహించిన సదస్సులో వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్ర పాల్గొని రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీనివాస్, సాజిదాబేగం, డీటీ విజయేందర్, ఆర్ఐ స్వప్న, రెవన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బుధవారం అల్లాపూర్, అల్లిపూర గ్రామాల్లో భూ భారతి సదస్సులు నిర్వహించనున్నారు.
పంచాయతీ కార్మికులసమస్యలు పరిష్కరించండి
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి
కొత్తూరు: పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ విభాగం పంచాయతీ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఈ నెల 20న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మె నోటీసును ఎంపీడీఓ అరుంధతికి అందజేశారు. అనంతరం నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు శేఖర్రెడ్డి, కార్మికులు సురేష్, దేవయ్య పాల్గొన్నారు.

బ్రిడ్జి పనులను సత్వరం పూర్తి చేయండి

బ్రిడ్జి పనులను సత్వరం పూర్తి చేయండి