
కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
నాంపల్లి: కారు ఢీకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన మాసబ్ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మణికంఠ(24) అనే యువకుడు జొమోటోలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున అతను అమీర్పేట నుండి మెహిదీపట్నం వైపు వెళుతుండగా మాసబ్ట్యాంక్లోని ఖాజా మెన్షన్ హాల్ సమీపంలో గుర్తు తెలియని కారు అతడిని ఢీకొనడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
శతాధిక వృద్ధురాలి మృతి
శంకర్పల్లి: శతాధిక వృద్ధురాలు మృతి చెందారు. మండలంలోని పర్వేద గ్రామానికి చెందిన కటికె మోతి బాయ్(102) ఆదివారం అనారోగ్యంతో తుదిశ్వాస వీడారు. వంద సంవత్సరాలు జీవించిన బామ్మను కడసారిగా చూసేందుకు గ్రామస్తులు తరలివచ్చారు. ఆమె మనుమడు సతీశ్ మాట్లాడుతూ.. వందేళ్ల వయస్సులోనూ అమ్మమ్మ ఎంతో హుషారుగా ఉండేదని, చిరుతిండికి అయిష్టత చూపేదని పేర్కొన్నారు.
‘ఫోన్ ట్యాపింగ్’శ్రవణ్రావుపై మరో కేసు
● ఇనుప ఖనిజం ఇప్పిస్తానంటూ మోసం
● అఖండ సంస్థ ఫిర్యాదు మేరకు రిజిస్టర్
● నిందితుల్లో శ్రవణ్ భార్య మరికొందరు
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఓ మీడియా సంస్థ యజమాని శ్రవణ్ కుమార్ రావుపై హైదరాబాద్లో మరో కేసు నమోదైంది. ఇనుప ఖనిజం వ్యాపారం డీల్ ఇప్పిస్తానంటూ మోసం చేశారని అఖండ ఇన్ఫ్రాటెక్ ఇండియా సంస్థ ఎండీ ఎ.ఆకర్ష్ కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు దీనిని రిజిస్టర్ చేశారు. రూ.6.5 కోట్ల గోల్మాల్తో ముడిపడి ఉన్న ఈ కేసులో శ్రవణ్రావుతో పాటు ఆయన భార్య స్వాతి రావు, వ్యాపార భాగస్వామి కేబీ వేదమూర్తి, ఎకోర్ ఇండస్ట్రీస్ హోల్టైమ్ డైరెక్టర్ ఉమా మహేశ్వర్రెడ్డి నిందితులుగా ఉన్నారు. గత నెల 25నే ఈ కేసు నమోదైనప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి
వచ్చింది. ఇన్రిధమ్ ఎనర్జీ సంస్థ డైరెక్టర్గా ఉన్న శ్రవణ్రావు 2022 జూన్లో ఆకర్ష్ను సంప్రదించాడు. కర్ణాటక, సాండూర్లో ఉన్న ఎకోర్ ఇండస్ట్రీస్ బాధ్యతల్ని తాను స్వీకరించినట్లు చెప్పాడు. ఇనుప ఖనిజం వ్యాపారంలో ఉన్న తమకు నిధులు సమకూరిస్తే ప్రతి టన్నుకు రూ.300 చొప్పున లాభం ఇస్తానంటూ నమ్మబలికాడు. దీంతో అఖండ సంస్థ 2022 నవంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు వివిధ దఫాలుగా ఎరోర్ సంస్థ ఖాతాల్లోకి రూ.6.5 కోట్లు బదిలీ చేసింది. ఈ చెల్లింపులకు సంబంధించి ఎకోర్ సంస్థ నుంచి తమకు ఎలాంటి ఇన్వాయిస్లు అందలేదని ఆకర్ష్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 2023 నాటికి సంబంధిత వ్యక్తులకు రూ.7 కోట్ల విలువైన ఇనుప ఖనిజం సరఫరా జరగాల్సి ఉండగా... అలా చేయకపోవడంతో ఆకర్ష్కు అనుమానం వచ్చింది. దీంతో ఆరా తీసిన ఆయన తమ సంస్థ బదిలీ చేసిన నిధుల్ని శ్రవణ్రావు వేరే అవసరాలకు మళ్లించినట్లు గుర్తించారు. దీనిపై పలుమార్లు ప్రశ్నించినా శ్రవణ్రావు నుంచి సరైన సమాధానం రాలేదు. కొన్ని రోజులకు శ్రవణ్రావు విదేశాలకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆకర్ష్ తన నిధులకు సంబంధించి శ్రవణ్ భార్య స్వాతితో పాటు వేదమూర్తిని పలుమార్లు సంప్రదించాడు. గత ఏడాది సెప్టెంబర్ వరకు వారు కేవలం రూ.50 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించారు. గత నెల వరకు ఎదురు చూసిన ఆకర్ష్ దీనిపై సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుతో పాటు బాధితుడు అనేక వాట్సాప్ చాటింగ్స్, ఈ–మెయిల్స్ ప్రతులకు జత చేశాడు. ఈ కేసును అధికారులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.