తాండూరు టౌన్: హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు టీబీ నుంచి ఉపశమనం పొందేందుకు నూతన ఔషధం అందుబాటులోకి వచ్చిందని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రవీంద్ర యాదవ్ తెలిపారు. 6 హెచ్పీ (600 మిల్లీ గ్రాములు) ఔషధాన్ని 28 రోజుల పాటు వాడితే వారికి జీవితంలో టీబీ సోకదన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఏఆర్టీ సెంటర్లో ఈ ఔషధాన్ని పలువురు హెచ్ఐవీ వ్యాధి గ్రస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్ఐవీ వ్యాధి గ్రస్తులు టీబీ సోకకుండా గతంలో ఆరు నెలల పాటు మందులు వాడేవారన్నారు. కొత్తగా వచ్చిన 6 హెచ్పీ ఔషధాన్ని 28 రోజుల పాటు వాడితే సరిపోతుందన్నారు. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు ఈ ఔషధాన్ని తప్పకుండా వాడాలన్నారు. కార్యక్రమంలో డాక్టర సమీవుల్లా, ఫార్మసిస్ట్ రమేష్, రవికుమార్, నర్సులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
హెచ్ఐవీ వ్యాధి గ్రస్తుల కోసం కొత్త ఔషధం
ప్రారంభించిన డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రవీంద్ర యాదవ్