అట్టడుగున తలసరి! | - | Sakshi
Sakshi News home page

అట్టడుగున తలసరి!

Mar 20 2025 8:01 AM | Updated on Mar 20 2025 7:59 AM

● రూ.10.55 లక్షల ఆదాయంతో రంగారెడ్డి టాప్‌ ● అత్యలంగా వికారాబాద్‌ జిల్లా

సాక్షి, రంగారెడ్డి జిల్లా: పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, వనరుల లభ్యత, మౌలిక సదుపాయాల అభివృద్ధితో తలసరి ఆదాయంలో జిల్లా తొలి స్థానంలో నిలిచింది. రాష్ట్ర తలసరి ఆదా యం సగటున రూ.3,46,457 ఉండగా.. రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. సామాజిక ఆర్థిక సర్వే–2025 ప్రకారం 2023–24 సంవత్సరానికి అత్యధిక తలసరి ఆదాయం రంగారెడ్డిలో ఉండగా అత్యల్పంగా వికారాబాద్‌ నిలిచింది.

గ్రేటర్‌ చుట్టూ..

గ్రేటర్‌ చుట్టపక్కల ప్రాంతాల్లో సంపద, ఆర్థిక అవకాశాలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఆయా జిల్లాలు బలమైన పారిశ్రామిక, ఐటీ, సేవా రంగాల వృద్ధి నుంచి ప్రయోజనం పొందుతాయి. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉండడంతో అధిక ఆదాయ స్థాయిలను కలిగిఉన్నాయి. తలసరి ఆదాయం అనేది ఒక జిల్లాలోని వ్యక్తుల సగటు ఆదాయం. ఇది జిల్లా ఆర్థిక ప్రగతిని సూచిస్తుంది. అభివృద్ధి కొన్ని పట్టణ జిల్లాల వైపు ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. ఆర్థిక ప్రయోజనాలు సమానం పంపిణీ చేయడంలో వైఫల్యం వల్లే కొన్ని జిల్లాల్లో తలసరి ఆదాయం తక్కువగా ఉంది.

జీడీపీలో రంగారెడ్డి హవా

స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి (జీడీపీ) వ్యవసాయం, తయారీ, సేవలు, నిర్మాణం ఇతర పరి శ్రమలతో సహా జిల్లాలో ఉత్పత్తి అయ్యే వస్తువులు, సేవల విలువలను సూచిస్తుంది. ప్రస్తుత ధరల ప్రకారం జీడీడీపీలో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. రాష్ట్రంలో అత్యధికం జీడీడీపీ రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాలు తొలి మూడు స్థానా ల్లో నిలిచాయి. రంగారెడ్డిలో జీడీడీపీ రూ. 3,17,898 కోట్లుగా ఉండగా.. హైదరాబాద్‌లో రూ.2,57,949 కోట్లు,మేడ్చల్‌–మల్కాజ్‌గిరిలో రూ.1,04,710 కోట్లుగా ఉంది. ఆర్థిక కార్యకలాపాలు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతంలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉండటమే ఈ వృద్ధి కొనసాగింపునకు ప్రధాన కారణం.

ఉత్తర, దక్షిన భాగాలుగా ‘ట్రిపుల్‌ ఆర్‌’

హైదరాబాద్‌లో రద్దీని తగ్గించడంతో పాటు ప్రాంతీయ కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు రీజినల్‌ రింగ్‌ రోడ్డును నిర్మించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ట్రిపుల్‌ ఆర్‌ పరిసర ప్రాంతాలలో ఆర్ధికంగా వృద్ధి చెందుతాయి. ఇప్పటికే హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి 50–60 కి.మీ. దూరంలో ట్రిపుల్‌ ఆర్‌ రానుంది. మొత్తం 361.52 కి.మీ. పొడవు ఉండే ట్రిపుల్‌ ఆర్‌ను ఉత్తర, దక్షిణ రెండు భాగాలుగా అభివృద్ధి చేయనున్నారు.

2023–24 సంవత్సర తలసరి ఆదాయం

రంగారెడ్డి రూ.10,55,913

హైదరాబాద్‌ రూ.5,54,105

సంగారెడ్డి రూ.3,45,478

మేడ్చల్‌–మల్కాజ్‌గిరి రూ.3,43,130

వికారాబాద్‌ రూ.1,98,40

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement