వేసవిలో తరచూ అగ్ని ప్రమాదాలు
● కేర్లెస్ స్మోకింగ్ కూడా ఓ కారణం ● ఫైర్ సేఫ్టీ లేకుండానే విద్యా సంస్థలకు అనుమతులు ● తనిఖీలు చేయని అధికారులు
వికారాబాద్: ఎండాకాలం వచ్చేసింది.. రోజురోజు కూ ఎండలు తీవ్ర రూపుం దాల్చుతున్నాయి. ఏటా వేసవిలో వందల సంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు కాలి బూడిదవుతున్నాయి. లక్షల్లో నష్టం వాటిళ్లుతోంది. మన జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో గడ్డి వాములు, వ్యవసాయ ఉత్పత్తులు, చేతికొచ్చిన పంట తగలబడటం చూ స్తూనే ఉన్నాం. వీటి నివారణకు అగ్నిమాపక అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. ముందస్తు జా గ్రత్తలు.. ప్రమాదాలు సంభవించే సమ యంలో తక్షణ చర్యలు తీసుకుంటే ప్రమాదస్థాయిని, ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవచ్చని పేర్కొంటున్నా రు. ప్రైవేటు, బహుళ అంతస్తుల భవనాలు నిర్మించే సమయంలో ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆగ్నిమాపక శాఖ సర్టిఫికెట్లు లేకుండానే విద్యా సంస్థలు, ఆస్పత్రులు, ఇతర సంస్థలు నిర్వహిస్తున్నారు. అధికారులు కూ డా సర్టిఫికెట్లు లేకుండానే అనుమతులు ఇస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
చాలా పాఠశాలల్లో..
జిల్లాలోని చాలా పాఠశాలలు, కళాశాలలు, సిని మా థియేటర్లు, గోదాములు, ఫంక్షన్ హాళ్లు, ఆస్పత్రులు, అపార్టుమెంట్లు ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. అగ్ని ప్రమాద నివారణ పరికరాలు కూడా అమర్చుకోవడంలేదు. జిల్లాలో దాదాపు 50 ప్రైవేటు పాఠశాలలు, 50 ఇంటర్, డిగ్రీ కళాశాలలు,10 సినిమా థియేటర్లు, 50 ఫంక్షన్ హాళ్లు, 200 పైచిలుకు ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో పది శాతం మినహా మిగి న వాటికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు లేకుండానే నిర్వహి స్తున్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీలు చేయకుండా సర్టిఫికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే హెచ్చరించే పరికరాలు, నియంత్రించే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ వీటిని ఎవరూ వినియోగించడం లేదు.
ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు
● స్కూళ్లు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్లో ఫైర్ అలారం, స్మోక్ డిటెక్టర్లను అమర్చుకోవాలి.
● సెల్లార్లలో ఆటోమెటిక్ స్పింక్లర్లు వాడాల్సి ఉంటుంది.
● స్కూళ్లు, ఆస్పత్రుల్లోకి, బయటకు వెళ్లే మార్గాల్లో అటంకాలు లేకుండా చూసుకోవాలి.
● ఇంటి నుంచి ఎక్కువ రోజులు బయటకు వెళ్లాల్సివస్తే ఎలక్ట్రిక్ మేయిన్ స్విచ్, గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. గ్యాస్ స్టౌ రెగ్యులేటర్ పైపును ఆరు నెలలకోసారి తప్పనిసరిగా మార్చాలి. మండుతున్న స్టౌలో కిరోసిన్ పోయరాదు.
● తాటాకులు, గడ్డి తదితర మండే పదార్థాలతో చేసిన పైకప్పులు స్కూళ్లు, ఆస్పత్రులకు వాడొద్దు.
● షాక్ సర్క్యూట్ బ్రేకర్స్ పరికరాలను అమర్చుకోవాలి. గోదాములు, గిడ్డంగుల్లో స్టాక్ను చెక్క స్లీపర్లపై నిల్వ చేసుకోవాలి. నీరు అగ్నిమాపక సాధనాలు అందుబాటులో ఉంచుకోవాలి.
● వేసవిలో సాధ్యమైనంత వరకు ఉదయం, సాయంత్రం వేళల్లోనే వంట చేసుకోవాలి. వంట సమయంలో కాటన్ దుస్తులు వాడటం మంచిది.
● కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గి పుల్లలు ఆర్పకుండా పడేయరాదు. ఇళ్లలో ఐఎస్ఐ మార్కింగ్ కలిగిన వైర్లను మాత్రమే వాడాలి.
● చిన్న పిల్లలకు అగ్గిపెట్టెలు, టపాకాయలు, లైటర్లు అందుబాటులో ఉంచకూడదు.
● పంట పొలాల్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. గడ్డి వాములు, పంట నూర్పిడులు, ధాన్యం తగలబడి భారీ నష్టానికి దారి తీస్తుంది. వీటి వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు గడ్డి వాములను ఆవాసాలకు దూరంలో ఉండేలా చూసుకోవాలి. గడ్డి వాములు ఒకదాని పక్కన ఒకటి ఉండకుండా ఏర్పాటు చేసుకోవాలి.
అడవికి నిప్పుపెడితే చర్యలు
ధారూరు: ధారూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అడవిని కొంతమంది అక్రమార్కులు తగులబెట్టి సాగుభూమిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ధారూరు ఫారెస్టు రేంజర్ రాజేందర్ తెలిపారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అసైన్డ్ పట్టాల కోసం కొందరు అడవిని దగ్దం చేస్తున్నారని తెలిపారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివారం రాత్రి ధారూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని రాస్నం అడవికి కొంతమంది అక్రమార్కులు నిప్పు పెట్టినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వారిపై చర్యలు ఉంటాయన్నారు. దోర్నాల్, పగిడ్యాల, కమాల్పూర్, రాస్నం, బాణాపూర్, బిజ్వారం, సంగాయపల్లితండా, తిమ్మాయపల్లి, అడాల్పూర్, జుంటుపల్లి, గంగాసాగర్ అటవీ ప్రాంతంలోకి రాత్రి వేళ అక్రమార్కులు ప్రవేశించి చెట్లకు నిప్పు పెడుతున్నారని పేర్కొన్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉంటాలని, ఇలాంటి వారిపై దృష్టి సారించాలని సూచించారు. అడవికి నిప్పు పెడితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.
జిల్లాలో 2022–24 మధ్య జరిగిన అగ్ని ప్రమాదాలు
ఏడాది జరిగిన ప్రమాదాలు నష్టం కోట్లలో ప్రాణ నష్టం
2022 154 4.17 10
2023 146 3.37 09
2024 147 3.04 06
అవగాహన ఉండాలి
అగ్ని ప్రమాదాలు ఎలా సంభవిస్తాయి.. ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్త లు తీసుకోవాలి అనే విష యంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. ఆగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, పెట్రోల్ బంకుల్లో మాక్ డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పిస్తున్నాం. స్కూళ్లు, ఆస్పత్రులు, గోదాములు, పెట్రోల్ బంకుల్లో అగ్ని ప్రమాదాలను నియంత్రించే సాధనాలను అమర్చుకోవా లి. జిల్లాలో చాలా వాటికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు లేవు. అలాంటి వాటికి నోటీసులు ఇస్తాం.
– పూర్ణచందర్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి
అగ్గి.. బుగ్గి