● మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహారెడ్డి ● గురుకులాలను తనిఖీ చేసిన అధికారులు
తాండూరు టౌన్: గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన బోధన, సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహారెడ్డి అన్నారు. బుధవారం ఆయన పట్టణ శివారులోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల, బాలుర గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే జినుగుర్తి పరిధిలోని కేజీబీవీ గురుకుల పాఠశాలను మున్సిపల్ మేనేజర్ నరేందర్రెడ్డి, పట్టణంలోని సాయిపూర్ గిరిజన బాలికల వసతి గృహాన్ని ఆర్ఐ అశోక్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లో అందుతున్న వసతులు, సౌకర్యాలు, తాగునీరు, భోజనం తదితర విషయాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంట గది, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి అధికారులు భోజనం చేశారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉత్తమ బోధనతో పాటు నాణ్యమైన భోజనం, వసతులను కల్పిస్తోందన్నారు. గురుకులాల నిర్వాహకులు విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలన్నారు. నాణ్యమైన భోజనం అందించడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.