తాండూరు టౌన్: మహిళను ఏమార్చి ఓ దొంగ నగదును కొట్టేశాడు. నడిరోడ్డుపై బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో జనాలు అవాక్కయ్యారు. క్షణాల వ్యవధిలో నగదు చోరీ గురికావడంతో చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించారు ఆ దంపతులు. వివరాలిలా ఉన్నాయి. బొంరాస్పేట మండలం తెట్టెకుంట తండాకు చెందిన రాజు, శారద దంపతులు తమ పాపతో కలిసి కారులో తాండూరుకు బుధవారం వచ్చారు. శారద తల్లికి అనారోగ్యంగా ఉండటం, చికిత్స నిమిత్తం డబ్బులు అవసరం పడటంతో పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం తాకట్టు పెట్టి రూ.1.29 లక్షల నగదును తీసుకున్నారు. అనంతరం సమీపంలో ఉన్న మెట్రోమనీలా హోటల్లో భోజనం చేశారు. వచ్చి చూసే సరికి కారు టైరు పంక్చర్ అయింది. దీంతో భర్త రాజు టైరు విప్పి పంక్చర్ వేయించేందుకు వెళ్లాడు. నగదు ఉండటంతో శారద, పాపను కారులోనే కూర్చోపెట్టి వెళ్లాడు. ఇంతలోనే ఓ ఆగంతకుడు అక్కడికి వచ్చి.. కారుకు టైరు తీశారని, కిందపడే ప్రమాదం ఉందని, అందులోనుంచి దిగాలని శారదకు సూచించాడు. కారు పడిపోతుందేమో అనే కంగారులో ఆమె పాపతో సహా కారు దిగింది. తర్వాత కారులో సీటుపై పెట్టిన నగదు కవరు కనపడలేదు. తనను ఏమార్చిన ఆగంతకుడే నగదు పట్టుకెళ్లి ఉంటాడని సదరు మహిళ లబోదిబోమంటూ భర్త రాజుకు ఫోన్లో సమాచారం ఇచ్చింది. అనంతరం దంపతులు పట్టణ పోలీసులు ఆశ్రయించి, నగదు చోరీ విషయమై ఫిర్యాదు చేశారు. అయితే దంపతులిద్దరూ బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం తాకట్టు పెట్టి నగదు తీసుకోవాన్ని గమనించిన దొంగ కావాలనే పంక్చర్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. సీసీ ఫుటేజీల ఆధారంగా దొంగను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నట్లు చెప్పారు.
రూ.1.29 లక్షల నగదు కొట్టేసిన కేటుగాడు