నవాబుపేట: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన బుధవారం ఉదయం మండలంలోని నారెగూడలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోషనొళ్ల పావని(30) భర్త పరమేష్తో కలిసి కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. తమకున్న ఎకరం పొలంతో పాటు అదే గ్రామానికి చెందిన ఓ రైతు పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. కొంత కాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం వేకువజామున బహిర్భూమికి వెళ్లిన పావని ఎంతకు రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబసభ్యులు వెతికారు. పొలంలోని బావి వద్ద ఆమె చెప్పులు, స్కార్ప్ ఉండడంతో మోటార్ల సహాయంతో నీటిని తోడేశారు. అందులో పావని మృతదేహం బయటకు తేలింది. మృతురాలి తండ్రి భీమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ అరుణకుమార్ తెలిపారు. మృతురాలికి ఇద్దరు కొడుకులు పురుషోత్తం(8), విఘ్నేశ్వర్ (6) ఉన్నారు.