
పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీసు
షాద్నగర్రూరల్: గ్రామ పాలనలో పంచాయతీ అధికారి విధుల పట్ల అలసత్వం వహించడంపై డీపీఓ సురేశ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఫరూఖ్నగర్ మండల పరిధిలోని ఎలికట్ట గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని జిల్లా పంచాయతీ అధికారి(డీపీఏ) సురేశ్మోహన్, డీఎల్పీఓ మల్లారెడ్డి, ఇన్చార్జి ఎంపీడీఓ జయంత్రెడ్డితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పంచాయతీ రికార్డులు, మినీట్యాంకులు, తడిచెత్త, పొడి చెత్త, భవన నిర్మాణం అనుమతులు, తాగునీటి పైపు లైన్లను పరిశీలించారు. వీటి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి తేజస్వినికి డీపీఓ షోకాజ్ నోటీసు జారీ చేశారు. గత మూడు నెలల నుంచి గ్రామపంచాయతీ సమావేశాలను నిర్వహించకపోవడంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధిలో అధికారులు తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.