వణుకుతున్న తీర ప్రాంతవాసులు
20 మీటర్లు వెనక్కి వెళ్లిన సముద్రం
రాబోయే 24 గంటలు కీలకం
పంటలపై తుపాను ప్రభావం
వాగులు..వంకలు.. నదుల్లో ఉధృతంగా ప్రవాహం
రెండు రోజులుగా స్తంభించిన జనజీవనం
తీవ్రమైన చలిగాలులు ప్రారంభం
ముంపువాసులకు ఎక్కడికక్కడ పునరావాసం
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన
అధికార యంత్రాంగం
వాకాడు : తుపాను ప్రభావంతో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే సముద్ర తీరంలో గంట గంటకు పెను మార్పులు వస్తున్నాయి. మూడు రోజుల క్రితం సముద్రం దాదాపు 10 మీటర్లు నుంచి 20 మీటర్లు వరకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం మోంథా దుపాను ముప్పునకు సంకేతంగా సముద్రం దాదాపు 20 మీటర్లు వెనక్కి వెళ్లింది. భీకర శబ్దాలతో అల్లకల్లోలంగా ఎగసి పడుతుంది. పెను ప్రమాదానికి సంకేతంగా దాదాపు 12 గంటల ముందు సముద్రం వెనక్కి వెళుతుందని వాతావరణశాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తర్వాత ఉవ్వెత్తున ఎగసిపడే అలలతో తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తుందని, ఇలాం పలుమార్లు జరిగిందని వెల్లడిస్తున్నారు.
తూపిలిపాళెంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు
తూపిలిపాళెం తీరంలో ఎగసి పడుతున్న కెరటాలు
జిల్లాలో మోంథా తుపాను దడ పుట్టిస్తోంది. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో తీరం దాటిన తర్వాత పెను ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే రెండురోజులుగా ఎడతెరపి లేని వర్షాలతో జనజీవనం దాదాపు స్తంభించింది. చలిగాలుల తీవ్రత పెరగడంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. ఈ క్రమంలో రాబోయే 24 గంటలు కీలకమని.. భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ముంపు ప్రాంతవాసులను అధికార యంత్రాగం పునరావాస కేంద్రాలకు తరలించింది. కంట్రోల్ రూమ్లు ద్వారా సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. వాగులు.. వంకలు.. చెరువులు.. నదుల్లో ఎవరూ దిగకుండా కట్టుదిట్టంగా నిఘా పెట్టింది. అయితే తుపాను ప్రభావంతో పలు చోట్ల పంటపొలాలు నీటమునిగాయి. రహదారులు దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈదురుగాలుల కారణంగా కొన్ని చోట్ల పూరిగుడెసెలు కూలిపోయాయి.
తిరుపతి అర్బన్ : మోంథా తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి చలిగాలులు అధికమయ్యాయి. గ్రామీణ రహదారుల నుంచి హైవేల వరకు వర్షాలతో గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఈ క్రమంలో రాబోయే 24 గంటలే కీలకమని భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
పరిశీలతోనే సరి
జిల్లాలోని ముంపు ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. నదులు, చెరువులు, వాగులు, వంకలను సందర్శిస్తున్నారు. అయితే ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టకుండా కేవలం పరిశీలనతో సరిపెట్టేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇచ్చామని, సమస్యలు తలెత్తితే సమాచారం ఇవ్వాలని చేతులు దులిపేసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ముంపు ప్రాంతాలకు చెందిన వారిని వరదనీరు వస్తే ఎక్కడి తరలిస్తున్నామో కూడా స్పష్టంగా చెప్పడం లేదు. మరోవైపు పలు కాలనీల్లో దెబ్బతిన్న ఇళ్లు ప్రస్తుత వర్షాలకు కూలే ప్రమాదమున్నప్పటికీ అప్రమత్తం చేయకుండా తూతూమంత్రంగా పరిశీలనలు చేపడుతున్నారు.
రైతులకు నష్టపోకుండా చర్యలు
చిట్టమూరు : తుపాను కారణంగా రైతులు నష్ట పోకుండా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. చిట్టమూరు మండలం ఎల్లసిరి చెరువును ఎస్పీ సుబ్బరాయుడు, ప్రత్యేక అధికారి అరుణ్ బాబుతో కలిసి పరిశీలించారు. గండ్లు పడకుండా చూడాలని ఇరిగేష్న్ ఎస్ఈ రాధాకృష్ణారెడ్డిని ఆదేశించారు. వరద నీరు చేరిన మన్నెమాలను సందర్శించారు. నాయుడుపేట–మల్లాం రహదారిపై పులికాలువపై కల్వర్టు వద్ద నిఘా పెట్టాలని సూచించారు. రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. షోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే కంట్రోల్ రూమ్కు తెలియజేయాలన్నారు. గర్భిణులు, బాలింతలకు ఇంటి వద్దనే చికిత్సలందించాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు.
తూపిలిపాళెంలో అధికారుల పర్యటన
తూపిలిపాళెంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు పర్యటించారు. అల్లకల్లోలంగా మారిన సముద్రాన్ని పరిశీలించారు. అధికారుల నుంచి కచ్చితమైన ఆదేశాలు వచ్చే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని కలెక్టర్ ఆదేశించారు.
ఉప్పుటేరుకు వరద ఉధృతి
చిల్లకూరు : మండలంలోని తిప్పగుంటపాళెం సమీపంలో ఉన్న ఉప్పుటేరు (కండలేరు క్రీక్)లో వరద ఉధృతి పెరిగింది. మంగళవారం రాత్రి కూడా వర్షం కురిస్తే రాక పోకలు నిలిచి పోయే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతంలో ఎవరూ వెళ్లకుండా అధికారులు ముళ్లకంపలు వేయించారు.
అరణియార్లో చేపల వేటపై నిషేధం
నాగలాపురం: తుపాను కారణంగా అరణియార్ ప్రాజెక్టులో నీటి మట్టం పెరిగింది. ఈ నేపథ్యంలో చేపలు వేటపై నిషేధం విధించినట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే మత్స్యకార లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
కాళంగి డ్యామ్ గేట్లు ఎత్తివేత
సూళ్లూరుపేట: కేవీబీ పురం మండలం అంజూరు వద్ద కాళంగి డ్యామ్ 21 గేట్లలో 5 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. . దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు. మరో ఐదు గేట్లు ఎత్తిన పక్షంలో సూళ్లూరుపేట గోకులకృష్ణా కళాశాల వద్ద హైవేపై వరద నీరు ప్రవహించే అవకాశం ఉంది. దీనికి గాను ముందుస్తుగానే చైన్నె నుంచి నెల్లూరు వైపు వచ్చే వాహనాలను తడ వద్దనే ఆపేస్తున్నారు. మంగళవారం రాత్రి నుంచి నెల్లూరు వైపు వెళ్లే వాహనాలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
చిల్లకూరు: తిప్పగుంటపాళెంసమీపంలో ఉప్పుటేరు ఉధృతి
గోవిందపల్లిలో చప్టాను పరిశీలిస్తున్న అధికారులు
కాలనీ వాసులతో మాట్లాడుతున్న అధికారులు
వాకాడు మండలంలో వెనక్కు వెళ్లిన సముద్రం
కల్యాణి డ్యామ్లో పెరిగిన నీటి మట్టం
దెబ్బతింటున్న పంటలు
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 8వేల ఎకరాల్లో నారుమళ్లు పోశారు. పంట కాలువలు పూడిపోవడంతో వరద నీరు పొలాల్లోకి చేరుతోంది. దీంతో నారుమళ్ల దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇసుక మేటలు వేస్తున్నాయని, దీంతో పంటల సాగుకు మరింత ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన చెందుతున్నారు. అలాగే జిల్లాలో సుమారు వెయ్యి ఎకరాల్లో సాగు చేస్తున్న కూరగాయ పంటలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.
సాగర తీరంలో అలజడి
నిరాశ్రయులకు పునరావాసం
నారాయణవనం: మండలంలోని తుంబూరు పంచాయతీ వెలుతురుకండ్రిగ ఎస్టీ కాలనీలో మూడు గుడిసెలు పూర్తిగా, 14 గుడిసెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మంగళవారం తహసీల్దార్ రోజారాణి, ఎంపీడీఓ అరుణ గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాలతో మాట్లాడారు. వెలుతురుకండ్రిగ ప్రాథమిక పాఠశాలలో పునరావాసం ఏర్పాటు చేశారు. సుమారు 40 మంది ఎస్టీ కాలనీ వాసులకు అన్ని సదుపాయాలను పునరావాసకేంద్రంలో కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు.
వణుకుతున్న తీర ప్రాంతవాసులు
వణుకుతున్న తీర ప్రాంతవాసులు
వణుకుతున్న తీర ప్రాంతవాసులు
వణుకుతున్న తీర ప్రాంతవాసులు
వణుకుతున్న తీర ప్రాంతవాసులు
వణుకుతున్న తీర ప్రాంతవాసులు
వణుకుతున్న తీర ప్రాంతవాసులు
వణుకుతున్న తీర ప్రాంతవాసులు
వణుకుతున్న తీర ప్రాంతవాసులు
వణుకుతున్న తీర ప్రాంతవాసులు
వణుకుతున్న తీర ప్రాంతవాసులు


