
రెండిళ్లలో చోరీ
చంద్రగిరి : మండలంలో దొంగలు రెచ్చిపోతుండడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రగిరి పట్టణ సమీపంలోని దిగువరెడ్డివారిపల్లిలో గురువారం రాత్రి రెండు తాళం వేసిన ఇళ్లలో చోరీలు జరిగాయి. ఈ చోరీలో రూ.40 వేల నగదు, 20 గ్రాముల బంగారం, 2.5 కేజీల వెండి అపహరించారని తెలిసింది. ఈ మేరకు బాధితులు గీతా, ఈశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థులకు చెక్కుల పంపిణీ
తిరుపతి అన్నమయ్యసర్కిల్/తిరుపతి కల్చరల్ : ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో నాదస్వర, డోలు విభాగాలకు సంబంధించి ఆరేళ్ల సర్టిఫికెట్, డిప్లొమా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు శుక్రవారం కళాశాలలో 46.20 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ముందుగా కళాశాల ప్రాంగణంలో ప్రతిష్టించిన శ్రీవారి విగ్రహానికి అభిషేకం, పూజలు నిర్వహించారు. అనంతరం పూర్వ విద్యార్థులు నాదాంజలి సమర్పించారు. కార్యక్రమంలో టీటీడీ డీఈఓ కార్యాలయం సూపరిటెండెంట్ శివకుమార్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.ఉమా ముద్దుబాల, నాదస్వర పాఠశాల హెడ్ బి.లక్ష్మీసువర్ణ పాల్గొన్నారు.
ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు
తిరుమల : తిరుమలలోని మాడ వీధులను ఎస్పీ హర్షవర్ధన్రాజు శుక్రవారం పరిశీలించారు. వీవీఐపీ, వీఐపీ గ్యాలరీలు, ఆస్థాన మండపం, బేడీ ఆంజనేయస్వామి, అఖిలాండం తదితర ప్రాంతాలను సందర్శించారు. ఎస్పీ మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి పకడ్బందీ బందోబస్తు కల్పించాలని ఆదేశించారు. అవాంఛనీయ ఘటనకు తావు లేకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బారికేడ్లు పెట్టాలని సూచించారు.
75 బస్తాల బియ్యం స్వాధీనం
వడమాలపేట (పుత్తూరు): ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, 75 బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ ధర్మారెడ్డి కథనం మేరకు.. గురువారం రాత్రి వడమాలపేట మండలం, తడుకు రైల్వే స్టేషన్ క్రాస్ వద్ద తనిఖీలు నిర్వహించారు. బొలేరో లగేజ్ వెహికల్ను ఆపి తనిఖీ చేయగా అందులో 50 కేజీల బరువు గల 75 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నాగలాపురం మండలం, బీరకుప్పం గ్రామానికి చెందిన దినేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.

రెండిళ్లలో చోరీ

రెండిళ్లలో చోరీ