
థియేటర్ గొడవపై కేసు నమోదు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్ఆర్ సినిమా థియేటర్ గొడవపై కేసు నమోదు చేసినట్లు 1వ పట్టణ సీఐ గోపి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గురువారం ఆర్ఆర్ సినిమా థియేటర్లో హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా కొంత మంది ఆకతాయిలు థియేటర్ యాజమాన్యంపై అసభ్యంగా ప్రవర్తించి గొడవ చేసి థియేటర్ ప్రధాన ద్వారం అద్దం పగులగొట్టారన్నారు. అద్దం పగులగొట్టింది చందు కాగా రవి, యేసు అనే వ్యక్తులు తాగి గొడవ చేశారన్నారు. శుక్రవారం చందు, రవిని పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం నిందితులను తహసీల్దారు ఎదుట హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. యేసు అనే వ్యక్తిని త్వరలో పట్టుకుని కౌన్సిలింగ్ ఇస్తామన్నారు.
షార్లో హిందీ భాషపై సదస్సు
సూళ్లూరుపేట : భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ఽ ధావన్ స్పేస్ సెంటర్ ‘షార్’లోని ఎంఆర్ కురూప్ ఆడిటోరియంలో శుక్రవారం హిందీ భాషపై ఒకరోజు సాంకేతిక సదస్సును షార్ డైరెక్టర్ ఏ రాజరాజన్ ఆధ్వర్యంలో చేపట్టారు. ‘అభివృద్ధి చెందిన భారతదేశానికి ఇస్రో సహకారం’ అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీఆర్ఎల్ డైరెక్టర్ ప్రొఫెసర్ అనిల్ భరద్వాజ్ ముఖ్య అఽతిథిగా హాజరయ్యారు. ‘ సౌరవ్యవస్థ అన్వేషణ’ అనే అంశంపై ఆయన హిందీలో ఉపన్యాసాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ ఇన్–హౌస్ జర్నల్ ప్రజ్వల్ను, సెమినార్ కార్యకలాపాలతో కూడిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో షార్ అధికారులతో పాటు ఎన్ఆర్ఎస్సీ ఏడీఆర్ఐఎన్ సెంటర్లో పాటు ఇతర సెంటర్ల ఉద్యోగులు పాల్గొని తమ ప్రజెంటేషన్లను ఇచ్చారు.
అంధ క్రీడాకారుడికి
ఆర్థిక సాయం
తిరుపతి అర్బన్: అంధ క్రీడాకారుడు ముప్పాళ్ల శేషగిరి ఇటీవల జరిగిన జాతీయ స్థాయి గోల్బాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపాడు. సెప్టెంబర్ ఒకటిన ఈజిప్టు దేశంలోని అలెగ్జాండ్రియాలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎన్నికయ్యాడు. ఆ పోటీల్లో పాల్గొనడానికి శేషగిరికి ఆర్థికంగా చేయూత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అంధుల క్రీడా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెంచల నరసయ్య తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ను గురువారం అభ్యర్థించారు. దీనిపై స్పందించిన రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్నాథ్ లింగుట్ల శుక్రవారం కలెక్టర్ వెంకటేశ్వర్ ద్వారా రూ.లక్ష సాయం అందించారు. వారు మాట్లాడుతూ అంతర్జాతీయ వీధుల్లో భారత దేశ జెండా రెపరెపలాడడం మన గర్వకారణమన్నారు. ప్రత్యేక ప్రతిభావంతుడైన శేషగిరిని అభినందించి ప్రోత్సహించడం దేశభక్తునిగా గర్వంగా ఉందని వారు తెలిపారు.
ఎర్ర చందనం కేసులో
నలుగురికి జైలు
నాగలాపురం: ఎర్ర చందనం అక్రమంగా తరలించిన కేసులో నలుగురికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3 లక్షలు జరిమానా విధించినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వివరాలు.. 2018వ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన శ్రీకాళహస్తి నుంచి తమిళనాడుకు 44 ఎర్ర చందనం దుంగలను రెండు కార్లలో తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో గురువారం తిరుపతిలోని ఎర్ర చందనం ప్రత్యేక కోర్టు అడిషినల్ న్యాయమూర్తి నరసింహమూర్తి తమిళనాడులోని కాంచీపురం తాలూకా శంకరాపురం గ్రామానికి చెందిన ఎం.భాస్కర్(34), పుగయేంది(30), బి.ప్రభు(35), జె.హుస్సేన్(24) అనే నిందితులకు శిక్ష విధించినట్లు ఎస్ఐ వివరించారు.

థియేటర్ గొడవపై కేసు నమోదు